ప్రధాని మోడీ తత్తరపాటు: దావోస్ ప్రసంగం మధ్య పనిచేయని టెలిప్రాంప్టర్: సెటైర్లతో చెలరేగిన రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో హఠాత్తుగా ఆయన వినియోగించే టెలిప్రాంప్టర్ స్తంభించిపోయింది. ఒక్కసారిగా అది పనిచేయడం మానేసింది. దీనితో ప్రధాని తత్తరపాటుకు గురయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక అయోమయానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. టెలిప్రాంప్టర్ లేకపోతే- ఆయన ఏమీ మాట్లాడలేరంటూ ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ఈ ఘటన మరింత బలాన్ని ఇచ్చినట్టయింది.
విమర్శలకు అవకాశం..
దీనికి అనుగుణంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ సెటైర్లతో చెలరేగిపోయారు. పదునైన వ్యాఖ్యలతో విమర్శలను గుప్పించారు. నరేంద్ర మోడీ టెలిప్రాంప్టర్ ప్రధాని అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆయన చెప్పే అబద్ధాలను చివరికి టెలిప్రాంప్టర్ కూడా స్వీకరించలేకపోయిందని, దాన్ని బయటికి చూపించలేకపోయిందంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మోడీ పేరు ట్రెండింగ్లో ఉంది. #TeleprompterPM అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ హ్యాష్ట్యాగ్ మీద వేలాది ట్వీట్లు పడుతున్నాయి.
దావోస్ సదస్సు..
ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు ఏర్పాటయ్యే విషయం తెలిసిందే. గత సంవత్సరం తరహాలోనే ఈ దఫా కూడా కరోనా వైరస్ కారణంగా- ఈ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం రాత్రి ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతుంది. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్, జపాన్ ప్రధానమంత్రి కిషిడ ఫ్యూమియో, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సువా వాన్డెర్ లెయెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ.. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.
తొలి రోజే మోడీ ప్రసంగం..
దేశ రాజధానిలోని తన కార్యాలయం నుంచి మోడీ- వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ ఫోరమ్ను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఈ రెండేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎదురైన సవాళ్లు.. వాటిని ఎలా ఎదుర్కొనగలిగామనే విషయాలను మోడీ వివరించారు. వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో దేశం స్వయం సమృద్ధిని సాధించిందనే విషయాన్ని ప్రస్తావించారు.
టెలిప్రాంప్టర్ స్తంభించడంతో..
ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా టెలిప్రాంప్టర్ స్తంభించిపోయింది..పని చేయడం మానేసింది. అనుకోకుండా చోటు చేసుకున్న ఈ ఘటనలో మోడీ కొంత తత్తరపాటుకు గురయ్యారు. ఒకట్రెండు సార్లు టెలిప్రాంప్టర్ వైపు చూశారు. తన ప్రసంగాన్ని అక్కడితో ఆపేశారు. హెడ్ ఫోన్స్ను చెవిలో పెట్టుకున్నారు. లాస్ ఆఫ్ సిగ్నల్స్.. అని చెప్పారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన మహిళ ఒకరు మోడీతో పాటు పాల్గొన్న మరో ప్రతినిధిని ఉద్దేశించి- ఆర్ యూ హియర్ మీ అని చెప్పగా.. తనకు సిగ్నల్స్ ఉన్నాయని బదులిచ్చారు. పారిశ్రామికవేత్తలకు తన ప్రసంగం వినిపిస్తోందా? అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు ఇందులో రికార్డయ్యాయి.
విమర్శల జడివాన..
టెలిప్రాంప్టర్ స్తంభించిపోవడం వల్ల మోడీ తన ప్రసంగాన్నిమధ్యలో కొద్దిసేపు ఆపేయడం విమర్శలకు తావిచ్చినట్టయింది. రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు మోడీని విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్నారు. ఆయన చెప్పే అబద్ధాలను టెలిప్రాంప్టర్ కూడా తీసుకోలేకపోతోందంటూ చురకలు అంటిస్తున్నారు. మెమెలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోన్నారు. టెలిప్రాంప్టర్ లేకపోతే.. మోడీ ఒక్క ముక్క మాట్లాడలేరని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.