చివరి ఆశ: సోషల్ మీడియాలో తమ బాధను చెప్పుకుంటున్న కేరళ వరదబాధితులు
కేరళలో పరిస్థితి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం ఇప్పటికే అతలాకుతలమైంది. 300కు పైగా మృతి చెందారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చాలామంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడున్నర కోట్ల మంది మళయాళీలు తమ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా సోషల్ మీడియాలో తమ కష్టాన్నితెలుపుతున్నారు. కరెంటు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయకచర్యలు చేపడుతున్న వారిని కలిసే వీలులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
అపార్ట్మెంట్లలో ఇరుక్కుపోయిన వారు, హాస్టళ్లలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, చర్చిల్లో ఆలయాల్లో భక్తులు ఇలా ప్రతి ఒక్కరు తమ గోడును వినిపించేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. తాము ఎక్కడున్నామో తెలియజెప్పేందుకు గూగుల్ మ్యాప్స్ను వినియోగించి లొకేషన్ను షేర్ చేస్తున్నారు. చేతులు జోడించి తమకు సహాయం చేయాల్సిందిగా అర్థిస్తున్న వీడియోలు చూస్తే అక్కడి ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. వారు అలా వేడుకోవడం చూస్తే హృదయాలను కలచివేస్తోంది. ఆ వీడియోలను వాట్సాప్ ద్వారా వారు షేర్ చేస్తున్నారు.
"మా కుటుంబం మా పొరుగువారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం "అని అజో వర్గీస్ అనే అలపుజ్జా నివాసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ వెంటనే వైరల్ అయ్యింది. అంతేకాదు తాగేందుకు మంచి నీళ్లు లేవు, ఆహారం లేదు, మధ్యాహ్నం నుంచి ఎవరితోనూ మాట్లాడేందుకు ఫోన్లు పనిచేయడం లేదు... మొబైల్ ఫోన్స్ నాట్ రీచబుల్ అనే సమాధానం వినిపిస్తోంది. ఎవరైనా సహాయం చేయండంటూ వర్గీస్ పోస్ట్ చేశాడు. మరికొందరు కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కార్యాలయానికి అక్కడి పౌరుల నుంచి సహాయం కోరుతూ ఫోన్లు వస్తున్నాయి. అయితే తామున్న ప్రదేశం లొకేషన్ షేర్ చేయాల్సిందిగా సిబ్బంది వారికి చెబుతోంది.
గతవారం ఓ ఎన్ఆర్ఐ మహిళ తన వారు వరదల్లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి సహాయం చేయాల్సిందిగా ఓ టీవీ ఛానెల్ ద్వారా తన బాధను చెప్పుకుంది. వారు పట్టణంతిట్ట జిల్లాలో ఉన్నారని చెప్పింది. అయితే ఇదే జిల్లానే వరదల ధాటికి పూర్తిగా ధ్వంసం అయ్యింది. "మేము రెండో అంతస్తులో ఉన్నాం. మొదటి అంతస్తు పూర్తిగా నీటితో మునిగిపోయింది. మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ వస్తోంది. మమ్మలను రక్షించండి ప్లీజ్.. చిన్న పిల్లలు, వృద్ధులు మాతోనే ఉన్నారు. వరద నీరు చిన్నగా రెండో అంతస్తుకు కూడా పాకేలా కనిపిస్తోంది . సహాయం అందించండి"అంటూ రన్నీ అనే ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం అక్కడ వరదల్లో చిక్కుకున్న వారికి సోషల్ మీడియానే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తాముంటున్న లొకేషన్ షేర్ చేస్తుండటంతో కొంతలో కొంతైనా సహాయక చర్యలు వేగాన్ని పుంజుకున్నాయి.