అపార్ట్ మెంట్ లో ఐబీఎం మహిళా టెక్కి హత్య
బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరును ల్యాప్ టాప్ చార్జర్ వైర్ తో హత్య చేసి పరారైన సంఘటన బెంగళూరు నగరంలోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పంజాబ్ కు చెందిన కుసుమా రాణి సింగ్లా అలియాస్ కుసుమా (31) అనే మహిళ హత్యకు గురైయ్యింది. ఈమె నోయిడాలోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసేవారు. ఆరు నెలల క్రితం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లోని బ్రాంచ్ (ఐబీఎం)కు బదిలి అయ్యారు.
బెంగళూరు చేరుకున్న కుసుమా కాడుగోడి సమీపంలోని మహావీర్ కింగ్స్ ప్లేస్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈమెతో పాటు ఢిల్లీకి చెందిన నిధి శర్మ అనే స్నేహితురాలు అక్కడే నివాసం ఉంటున్నది.
మంగళవారం ఈమె కార్యాలయానికి సెలవు పెట్టి అపార్ట్ మెంట్ లోనే ఉన్నారు. తరువాత పని మీద బయటకు వెళ్లి వచ్చింది. రాత్రి 7.30 గంటల సమయంలో నిధి శర్మ అపార్ట్ మెంట్ కు చేరుకున్న తరువాత కుసుమా హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.
మంగళవారం మద్యాహ్నం 12.30 గంటల సమయంలో కుసుమాను కలవాలని ఓ వ్యక్తి అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లాడు.ఆ సమయంలో కుసుమా ఇంటిలో లేరు. మద్యాహ్నం 1 గంటకు అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లిన కుసుమా ఆ వ్యక్తిని తన ఫ్లాట్ కు తీసుకు వెళ్లారు.
తరువాత మద్యాహ్నం మూడు గంటల సమయంలో అతను అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళ్లిపోయాడని అదే అపార్ట్ మెంట్ లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కుసుమాను ఆమె ల్యాప్ టాప్ చార్జర్ వైర్ తో గొంతు బిగించి హత్య చేశారని పోలీసులు అన్నారు.
కుసుమాకు గతంలో వివాహం అయ్యింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి వేరుగా నివాసం ఉంటున్నది. మళ్లి పెళ్లి చేసుకోవాలని పలు వెబ్ సైట్లలో ప్రకటనలు ఇచ్చింది. వెబ్ సైట్ లో పరిచయం అయిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు.
తరువాత తన దగ్గర ఆర్థిక సహాయం తీసుకుని మోసం చేశాడని కుసుమా 2015 డిసెంబర్ 30వ తేదిన కాడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనే కుసుమాను హత్య చేసి ఉంటాడని కాడుగోడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హత్య చేసిన తరువాత కుసుమా ఇంటిలో ఎలాంటి వస్తువులు చోరీ కాలేదని, ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయని, పెనుగులాట జరగలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. అపార్ట్ మెంట్ లోని సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.