ఫుట్ బాల్ ఆడుతూ టెక్కి మృతి
బెంగళూరు: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కి) ఫుట్ బాల్ ఆడుతూ మృతి చెందిన సంఘటన బెంగళూరు నగర శివార్లలో జరిగింది. బెంగళూరు-మైసూరు మార్గంలోని రామనగర సమీపంలో టెక్కి మరణించాడు.
బెంగళూరు నగరంలోని నాగరబావిలో నివాసం ఉంటున్న పవన్ కుమార్ (28) బెంగళూరులోని ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను మైసూరులో స్నేహితులు నిర్వహించిన ప్రయివేటు పార్టీకి వెళ్లాడు.
పార్టీ ముగించుకుని స్నేహితులతో కలిసి బెంగళూరు వైపు బయలుదేరాడు. మార్గం మద్యలో రామనగర సమీపంలోని మాయగానహళ్ళిలో రాస్తా కేఫ్ లో ఫుట్ బాల్ ఆడటానికి వెళ్లారు. ఆ సమయంలో పవన్ కుమార్ ఫుట్ బాల్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.
వెంటనే పవన్ కుమార్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పవన్ కుమార్ మరణించాడని వైద్యులు చెప్పారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.