కరోనా : వాళ్ల కారణంగా లేని ముప్పు..? భారత్లో లాక్ డౌన్ రియాలిటీ ఎలా ఉందంటే..
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపుకు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ఇన్షార్ట్స్ నిర్వహించిన ఓ సర్వేలో 88శాతం మంది భారతీయులు లాక్ డౌన్ పొడగింపును కోరుకుంటున్నట్టు వెల్లడైంది. చాలామంది లాక్ డౌన్కు సహకరిస్తున్నప్పటికీ.. అక్కడక్కడా లోటుపాట్లు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత వర్గాలకు చెందినవారు లాక్ డౌన్ పీరియడ్లోనూ పని మనుషులపై ఆధారపడుతుండటం కొన్నిచోట్ల కొత్త కేసుల నమోదుకు దారితీస్తోంది. ఇంతటి సంక్లిష్ట సమయంలోనూ వీరి నిర్లక్ష్య వైఖరి కరోనాపై పోరును బలహీనపరుస్తోందన్న విమర్శలకు తావిస్తోంది.
ఢిల్లీ డిఫెన్స్ కాలనీలో జరిగిన ఆ ఘటన..
ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో నివాసముండే ఓ ఉన్నతవర్గానికి చెందిన కుటుంబంలో ఈ వారం ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. అయితే ఆ ఇంటి సెక్యూరిటీ గార్డ్ వల్లే వీరికి కరోనా సోకిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇటీవల నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చినందువల్లే.. అతని నుంచి వారికి కరోనా సోకిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ గార్డ్కి కరోనా సోకిందా లేదా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఇదంతా పక్కనపెడితే.. లాక్ డౌన్ పీరియడ్లోనూ సెక్యూరిటీ గార్డ్ను రోజూ విధులకు పిలుస్తుండటం.. డిఫెన్స్ కాలనీలోకి అతని రాకపోకలు నిబంధనలు ఉల్లంఘించడమే కదా అన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి కాలనీ మొత్తాన్ని రిస్క్లోకి నెట్టిన ఆ కుటుంబంపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ అదే తీరు...
ఇదొక్కటే కాదు.. డిఫెన్స్ కాలనీలో ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఇప్పటికీ డిఫెన్స్ కాలనీలోని చాలా కుటుంబాలు పని మనుషులను,సెక్యూరిటీ గార్డులను రోజూ పనిలోకి పిలుస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలను తప్పు పట్టాల్సింది పోయి.. పని మనుషులు,డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులపై యజమానులు నిఘా పెట్టాలని పోలీసులు చెప్పడం వీటిని ఆమోదించినట్టయింది.
ఓ ఉద్యోగి ద్వారా పని మనిషికి..
దేశ రాజధాని ఢిల్లీలో కంటైన్మెంట్ విధించిన ఓ మురికివాడలో ఓ పని మనిషికి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఆమె పనిచేసే ఇంటి యజమాని ద్వారా ఆమెకు వైరస్ సోకినట్టు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ ఉద్యోగి అయిన ఆ యజమాని పనిచేసే కంపెనీలో 39 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. బుధవారం(ఏప్రిల్ 8) నాటికి నోయిడా పరిధిలో నమోదైన 58 పాజిటివ్ కేసుల్లో 39 కేసులు వీరివే కావడం గమనార్హం. ఎన్డీటీవీ ప్రచురించిన మరో కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నమోదైన 80 కరోనా పాజిటివ్ కేసుల్లో 40 హెల్త్ డిపార్ట్మెంట్కి చెందినవారివే కావడం గమనార్హం. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే వీరికి వైరస్ సోకిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ సోకిన హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి.. విధులకు హాజరైనట్టు గుర్తించారు. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Recommended Video
ఉన్నతవర్గాలకు మినహాయింపులు..?
మరికొన్ని ఘటనలను పరిశీలిస్తే.. గురువారం(ఏప్రిల్ 9)న దెవాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ యజమాని వధవాన్ కుటుంబం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ పీరియడ్లోనూ ఆ కుటుంబం ముంబై నుంచి కారులో ఓ హిల్ స్టేషన్కు బయలుదేరింది. అయితే ఉన్నతాధికారులు వారికి ఎమర్జెన్సీ పాస్ జారీ చేశారని.. అందుకే చెక్ పోస్టుల వద్ద కూడా ఎవరూ ఆపలేదని టైమ్స్ నౌ కథనం పేర్కొంది. ఓవైపు కాలి నడకన స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే.. ఇలా ఉన్నత వర్గాలకు మాత్రం ప్రత్యేక అనుమతులు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలంతా లాక్ డౌన్ను కచ్చితంగా పాటిస్తున్నవేళ.. కొంతమంది ఉన్నత వర్గాలు ప్రత్యేక మినహాయింపులు పొందడం,ఇలాంటి సమయంలోనూ పనివాళ్లు,డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి రప్పించడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి చర్యలు భారత్కు లేని ముప్పును తీసుకొస్తాయని.. ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.