బెంగాల్లో హింసాత్మకం, కేంద్రమంత్రి సుప్రియోపై కేసు : ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా నాలుగో విడత లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.
ఈవీఎంలో భవితవ్యం నిక్లిప్తం
కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ బమ్రే, ఎస్ఎస్ అహ్లూవాలియా, బాబుల్ సుప్రియోతో పాటు కాంగ్రెస్ ప్రముఖులు సల్మాన్ ఖుర్షీద్, సినీనటి ఊర్మిళ మతోండ్కర్, సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ సహా 961 అభ్యర్థుల భవితత్యాన్ని 12.79 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
60.28 శాతం పోలింగ్
సాయంత్రం 6 గంటల వరకు 60.38 పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా 76.47 శాతం, కశ్మీర్ లో అత్యల్పంగా 9.79 శాతం నమోదైంది. బీహర్లో 53.67 శాతం, మధ్యప్రదేశ్లో 65.86 శాతం, మహారాష్ట్ర 51.06 శాతం, ఒడిశా 64.05 శాతం, రాజస్తాన్ 62.86 శాతం, ఉత్తర్ప్రదేశ్ 53.12 శాతం, జార్ఖండ్ 63.40 శాతం పోలింగ్ నమోదైంది.
బెంగాల్లో హింస, బాబుల్ సుప్రియోపై కేసు
ఇటు పశ్చిమబెంగాల్ లో హింసాత్మక ఘటనలు జరిగాయి. బిర్భూమ్ జిల్ల ననూర్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలను టీఎంసీ కార్యకర్తలు అడ్డగించారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించడమే గాక పోలింగ్ ఏజెంట్, ఎన్నికల అధికారిని కేంద్ర మంత్రి, సిట్టింగ్ అన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో బెదరించారు. దీనిపై టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేయగా .. కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.