ఎగ్జామ్ ఫీజుకు డబ్బులు ఇవ్వలేదని.. ఓ కొడుకు ఏం చేశాడంటే !!
ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను గమనిస్తే... క్షణిక ఆవేశం ఎంతటి ప్రమాదకర ఫలితాలను ఇస్తుందో అర్థమవుతోంది. చిన్న చిన్న కారణాలకే మనుషులు మృగాళ్లలా ప్రవర్తిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. చెప్పింది చేయలేదని, మద్యానికి డబ్బులు ఇవ్వలేదని, అడిగిన వస్తువు కొనివ్వలేదని, అనుమానంతో... ఇలా తేలికపాటి కారణాలకే కుటుంబాల్లో విషాదాలు నెలకొంటున్నాయి. అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పరీక్ష ఫీజు కోసం తండ్రి ప్రాణం తీసిన కొడుకు..
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ యువకుడు క్షణిక ఆవేశానికి లోనై తన తండ్రి ప్రాణం తీశాడు. పరీక్ష ఫీజు కోసం డబ్బులు అడిగినా ఇవ్వలేదని.. 24 ఏళ్ల అజయ్ పంచల్ తన 70 ఏళ్ల తండ్రి దేవీదాస్ కాశీరామ్ పంచల్ను హత్య చేశాడు. ఈ ఘోర సంఘటన లాతూర్ జిల్లా హిన్పాల్నర్ గ్రామంలో మంగళవారం ఉదయం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాగా దేవీదాస్ కూరగాయలు అమ్ముతూ, కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని కుమారుడు అజయ్ 12వ తరగతి వరకు చదివి, పోలీస్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చదువులో భవిష్యత్తు చూసే అజయ్, పరీక్ష ఫీజు కోసం తండ్రిని పలుమార్లు అడిగాడు. కానీ తండ్రి వద్ద డబ్బు లేకపోవడంతో ఇవ్వలేకపోయాడు. ఈ విషయంలోనే సోమవారం రాత్రి భారీ వర్షాల కారణంగా మంటకు ఉపయోగించే కట్టెలు తడిశాయి.
దీంతో వంటకు మార్గం లేకపోవడంతో దేవీదాస్ భార్య గ్యాస్ సిలిండర్ కొన్నది. ఈ విషయం చూసిన అజయ్ కోపంతో ఉడికిపోయాడు. పరీక్ష ఫీజు కోసం డబ్బు ఇవ్వలేదని, కానీ సిలిండర్ కొనేందుకు మాత్రం డబ్బు వెచ్చించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తండ్రి మరుసటి రోజు డబ్బు సమకూరుస్తానని చెప్పినా అతను వినిపించుకోలేదు.
ఈ మేరకు మంగళవారం ఉదయం కూడా మళ్లీ అదే విషయంపై తండ్రి-కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. క్షణిక ఆవేశానికి లోనైన అజయ్ కట్టెతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. గాయాల తీవ్రతతో దేవీదాస్ అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఈ సంఘటనపై బాధితుడి భార్య ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు వెంటనే అజయ్ పంచల్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications