సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: స్వల్ప అస్వస్థత కారణంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే బుధవారం ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆమె శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వెల్లడించాయి.
మంగళవారం నుంచి సోనియా గాంధీ అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది. అందుకే ఉత్తరప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో ఏడు కిలోమీటర్లు నడిచిన తర్వాత.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగి వచ్చారని తెలిసింది. బుధవారం ప్రియాంక దగ్గరుండి సోనియాను ఆస్పత్రికి తీసుకెళ్లారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సోనియా గాంధీ గత ఏడాదిలో రెండుసార్లు కరోనావైరస్ బారిన పడ్డారు. జూన్లో ఒకసారి, ఆగస్టులో రెండోసారి ఆమెకు కరోనా సోకింది. ఫలితంగా కొవిడ్ అనంతర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావమైంది. అప్పుడు కూడా సర్ గంగా రామ్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారు.