ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ: కొద్ది రోజుల విశ్రాంతి, 23న ఈడీ ముందుకు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సర్ గంగారాం ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంచార్జ్ జైరామ్ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియాను కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు.
కరోనా వైరస్ అనంతరం వచ్చిన ఆరోగ్య సమస్యలతో 9 రోజుల పాటు సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు సోనియా. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కాగా.. జూన్ 12న సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. కొవిడ్ అనంతర అనారోగ్య సమస్యలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం కూడా చికిత్స తీసుకున్నారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కరోనా అనారోగ్య సమస్యల వల్ల సోనియా ఈ విచారణకు హాజరుకాలేనని చెప్పారు. దీంతో జూన్ 23న విచారణకు హాజరయ్యేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు.
రాహుల్ గాంధీ మాత్రం సోమవారంతో కలిపి మొత్తం నాలుగు రోజులు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే, సోనియా, రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుందని ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈరోజు రాష్ట్రపతిని కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.