కేంద్రంపై నిప్పులు చెరిగిన సోనియా-న్యాయవ్యవస్ధతో పోరా ? చైనా చొరబాట్లు పట్టించుకోరా?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఇవాళ నిప్పులు చెరిగారు. పార్లమెంటులోని సీపీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎంపీల భేటీలో సోనియా గాంధీ న్యాయవ్యవస్ధతో కేంద్రం ఘర్షణ, చైనా చొరబాట్లపై కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఇవాళ కేంద్రం సుప్రీంకోర్టుతో అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిపై మండిపడ్డారు. న్యాయవ్యవస్థను చట్టవిరుద్ధం చేయడానికి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోనియా ఆరోపించారు.పార్లమెంటులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి)ని ఉద్దేశించి సోనియా ప్రసంగించారు. పదేపదే చైనా చొరబాట్లపై పార్లమెంటులో చర్చకు బీజేపీ ప్రభుత్వం మొండిగా నిరాకరించడం ప్రజాస్వామ్యంపై దానికున్న అగౌరవాన్ని చూపుతుందని సోనియా విమర్శించారు.
వివిధ కారణాలతో మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం న్యాయవ్యవస్ధను విమర్శించేందుకు ప్రయత్నించడం దారుణమని సోనియా గాంధీ విమర్శించారు. ఇది ఎంతమాత్రం సరికాదని ఆమె అన్నారు. దీనికి బదులు సహేతుకమైన సూచనలను అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. కానీ వారు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఇది ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు.
మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సీపీపీ భేటీలో సోనియాగాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అదే సమయంలో చైనా చొరబాట్లను కూడా అడ్డుకోలేకపోతోందని సోనియా ఆరోపించారు. చైనా నుంచి ఎదురవుతున్న చొరబాట్ల సమస్య జాతీయ స్ధాయిలో చర్చించాల్సిన అంశమని సోనియా తెలిపారు.