పార్లమెంటు స్తంభన: సోనియా ఫైర్, సుష్మ వివరణ
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. సోమవారం లోకసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే లలిత్ మోడీ, వ్యాపం కుంభకోణం అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆరోపణలపై చర్చించాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, విపక్షాల ఆందోళన నడుమే లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
అయినా లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని ప్లకార్డులతో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఓ వైపు గందరగోళం నెలకొన్నప్పటికీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను అలానే కొనసాగించే ప్రయత్నం చేశారు. దీంతో సభ్యులు ఏయే ప్రశ్నలు అడుగుతున్నారో, వాటికి మంత్రులు ఏం సమాధానాలు చెప్పారనేదానిపై సమావేశాల వీక్షకులకు స్పష్టత లేకుండాపోయింది.
సోనియా ఆగ్రహం
మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని విఫలమవుతున్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకున్న తర్వాతే చర్చకు సహకరిస్తామని సోనియా స్పష్టం చేశారు.
రాజ్యసభలోనూ గందరగోళమే: సుష్మా వివరణ
విపక్షా లను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా మైకు అందుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. లలిత్మోదీకి వీసా కోసం తాను సిఫార్సు చేయలేదని వివరణ ఇచ్చారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్న అన్ని అంశాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుష్మాస్వరాజ్ ప్రకటించారు. సభలో ఆమె ప్రకటన చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు.
ముందు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని, ఆ తరువాత వివరణ ఇవ్వాలని పట్టుబట్టాయి. సుష్మా స్వరాజ్ తిరిగి తన స్థానంలో కూర్చున్నతర్వాత కాస్త వెనక్కు తగ్గిన విపక్షాలు తమ తమ స్థానలవద్దకు వెళ్లి అక్కడ నిల్చొని స్లోగన్లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. కాగా, లోకసభ 2గంటల వరకు వాయిదా పడింది.
స్పీకర్ నేతృత్వంలో అఖిలపక్షం
పార్లమెంటు ప్రతిష్టంభనపై స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. కాగా, వసుంధర రాజే, సుష్మ స్వరాజ్ల రాజీనామాల తర్వాతే చర్చకు సహకరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.