సోనియా గాంధీ అల్లుడి కోసం బెంగళూరులో రూ. 7 వేల కోట్ల భూమి కబ్జా, ఇదే సాక్షం !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మీద కర్ణాటక బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. రాబర్ట్ వాద్రా భాగస్వామిగా ఉన్న డీఎల్ఎఫ్ కంపెనీకి బెంగళూరులో 1,100 ఎకరాల భూములు అక్రమంగా కేటాయించారని బీజేపీ ఆరోపిస్తూ సాక్షాలు విడుదల చేసింది.
437 పత్రాలు
బీజేపీ కర్ణాటక అధికార ప్రతినిధి ఎన్ఆర్. రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా భాగస్వామ్యం అయిన డీఎల్ఎఫ్ కంపెనీకి అక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి చెందిన 1,100 ఎకరాల భూమిని కబ్జా చేసి ఇచ్చారని ఆరోపిస్తూ 437 పత్రాలను మీడియాకు విడుదల చేశారు.
రూ. 7 వేల కోట్ల విలువ
కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పెద్దలు రూ. 7 వేల కోట్ల విలువైన 1,100 ఎకరాల భూమిని అక్రమంగా రాబర్ట్ వాద్రా భాగస్వామ్య కంపెనీ డీఎల్ఎఫ్ కు కట్టబెట్టారని ఎన్ఆర్. రమేష్ ఆరోపించారు.
నాలుగు ప్రాంతాలు
బెంగళూరు నగరంలోని తావరకెరె పరిధిలోని గంగేనహళ్ళి, వర్తూరు, పెద్దనపాళ్య, నరసీపుర గ్రామాల్లోని 1,100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రాబర్ట్ వాద్రా భాగస్వామికి అక్రమంగా అప్పచెప్పి రాజకీయ లబ్ది చేకూర్చుకున్నారని ఎన్ఆర్. రమేష్ ఆరోపించారు.
మాజీ సీఎం, అధికారుల హస్తం !
రాబర్ట్ వాద్రా భాగస్వామిగా ఉన్న డీఎల్ఎఫ్ కంపెనీకి అక్రమంగా భూములు కేటాయించిన విషయంపై మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్.టి. సోమశేఖర్, గతంలో బెంగళూరు జిల్లాధికారిగా పని చేసిన వి. శంకర్, అదనపు జిల్లాధికారి వెంకటాచలపతి, తహసిల్దార్ దయానంద్ సహకరించారని ఎన్ఆర్. రమేష్ ఆరోపించారు.
ఈడీ,ఐటీ శాఖ అధికారులు
వీరందరి మీద విచారణ జరిపించాలని ఈడీ, ఆదాయపన్ను శాఖ అధికారులు, ఏసీబీ, లోకాయుక్త, బీఎంటీఎఫ్ తదితర అధికారులకు ఫిర్యాదు చేశామని ఎన్.ఆర్. రమేష్ చెప్పారు. రాబర్ట్ వాద్రా కంపెనీకి చెందిన భూములు కబ్జా చేసి వాటికి మంత్రి డీకే. శివకుమార్ అక్రమంగా ప్రహరీ గొడలు నిర్మిస్తున్నారని ఎన్ఆర్. రమేష్ ఆరోపించారు.