మహా సంక్షోభం..నాన్చుతున్న కాంగ్రెస్: సోనియా నేతృత్వంలో కోర్ గ్రూప్ భేటీ..ఆ తరువాత వార్ రూమ్?
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత ఇక అఖిల భారత కాంగ్రెస్ కమిటీపై పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివసేనకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే సింగిల్ లైన్ అజెండాపై సోమవారం రోజంతా మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ అధిష్ఠానం.. ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ ముగిసిన తరువాత మిత్రపక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజమంత్రి శరద్ పవార్ తో సోనియాగాంధీ ఫోన్ లో మాట్లాడారు. సీడబ్ల్యూసీ భేటీ తరువాత కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.
కోర్ గ్రూప్ భేటీ తరువాతైనా..
సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ కోర్ గ్రూప్ భేటీకి సిద్ధపడింది. న్యూఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. కాంగ్రెస్ పార్టీ కోర్ గ్రూప్ సభ్యులు దీనికి హాజరవుతారు. శివసేనకు మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటిని ఎలా పరిష్కరించవచ్చనే విషయాలపై కోర్ గ్రూప్ సమావేశంలో ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. దీనితోపాటు- సోనియాగాంధీ, శరద్ పవార్ మధ్య చోటు చేసుకున్న ఫోన్ సంభాషణ వివరాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. శరద్ పవార్ అభిప్రాయం ఏమిటనే విషయాన్ని సోనియాగాంధీ వివరిస్తారు.
ఆ తరువాత వార్ రూమ్ భేటీ..?
కోర్ గ్రూప్ సమావేశం అనంతరం వార్ రూమ్ భేటీ ఉండొచ్చని తెలుస్తోంది. వార్ రూమ్.. రాజకీయంగా అత్యంత సున్నితమైన, పార్టీ మూలాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న, కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను ఏర్పాటు చేసుకుంది. అతి కొద్ది ముఖ్య నాయకులకు మాత్రమే ఇందులో సభ్యత్వం ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల రాజకీయపరమైన వనరులు, అవకాశాలు, శివసేనకు మద్దతు ఇవ్వడం, శివసేన మంత్రివర్గంలో చేరాలా? వద్దా? అనే విషయాలపై వార్ రూమ్ లో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
డెడ్ లైన్ పొడిగింపు లేనట్టే..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శివసేనకు సోమవారం సాయంత్రం 7:30 గంటల వరకు గడువు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోవడంతో గడువును పొడిగించాలంటూ శివసేన చేసిన విజ్ఞప్తికి గవర్నర్ అంగీకరించారు. మూడు రోజుల గడువు కోరగా.. దాన్ని తిరస్కరించారు. మంగళవారం రాత్రి 8:30 లోగా నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశించారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం ఎంతమాత్రమూ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో- కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని గడువులోగా వెల్లడించాల్సి ఉంటుంది.