మహిళే ప్రధాని: దీదీనా బెహన్జీనా..సోనియా మొగ్గు అటువైపే..?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మే 19న ముగుస్తాయి. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ సొంత లెక్కలు వేసుకుంటున్నాయి. రెండు జాతీయ కూటములకు స్పష్టమైన మెజార్టీ రాకుంటే పరిస్థితి ఏంటి..? ప్రాంతీయ పార్టీకి చెందిన నేతలు ప్రధాని పీఠం వైపు చూస్తున్నారా..? సంకీర్ణ ప్రభుత్వం వస్తే సమీకరణాలు ఎలా మారుతాయి..? ఎవరికి ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి..? ఓవరాల్గా బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ఏమైనా త్యాగాలు చేసే అవకాశం ఉందా..?
ప్రాంతీయ పార్టీల డిమాండ్కు బీజేపీ తలొగ్గుతుందా..?
రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ బీజేపీకి అధికారంలోకి రాకుండా చూసే క్రమంలో కాంగ్రెస్ ప్రధాని పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఫలితాల తర్వాత సమీకరణాలు ఎటైనా మారే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డయేతర ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక బీజేపీకి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే వారికి ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా రెండోసారి పోటీలో మోడీ ఉన్నారు. పోటీ అని చెప్పడం కన్నా మోడీకే ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఎన్డీయే కూటమికి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలంటే ఆ పార్టీలకు కొన్ని కీలక మంత్రి పదవులు కట్టబెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు హోమ్ శాఖ, రక్షణ శాఖ, రైల్వేశాఖ, రవాణా శాఖ, గ్రామీణ ప్రాంత అభివృద్ధి శాఖ లాంటి కీలక పదవులను ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ చేజార్చుకునేందుకు సిద్ధంగా లేదు.
సంకీర్ణంలో కాంగ్రెస్ ఏ శాఖలు కోరనుంది..?
అదే ఎన్డీయేతర ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ మద్దతుతో ఇతరులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే హస్తం పార్టీ కీలకమైన ఆర్థిక శాఖ, మరియు విదేశీ వ్యవహారాల శాఖను కోరే అవకాశం ఉంది. ఇక 2019 ఎన్నికల ప్రచారంలో తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని ఎక్కడా రాహుల్ కానీ, లేదా ఇతర పార్టీ సీనియర్ నాయకులు కానీ చెప్పలేదు. అంటే వారికి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. ఒక్క తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ మాత్రమే రాహుల్ తమ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని చెప్పారు. 2019 ఎన్నికలు మాత్రం మోడీ నేతృత్వంలోని బీజేపీ ఎన్డీయే ఒక వైపు ఉండగా ఇతర ఎన్డీయేతర కూటములన్నీ ఒక తాటిపైకొచ్చాయి. మే 23 తర్వాత ఏదైనా జరిగే అవకాశం ఉంది.
సమీకరణాలు ఎలా ఉన్నాయి.. ఎలా మారబోతున్నాయి..?
మే 23 ఫలితాల తర్వాత మోడీ నేతృత్వంలోని బీజేపీ ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ రావాలి, ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు కావాల్సి ఉంది. అయితే ఎన్డీయేకు 30 సీట్లు తక్కువగా వస్తే వెంటిలేటర్ పై ఉన్న ఎన్డీయేను ఆదుకునేందుకు వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ, ఏడీఎంకే ఇతర ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బేరసారాలు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ పార్టీలు కీలక మంత్రి పదవులను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ఇతర ఎన్డీయేతర పార్టీలు 300 స్థానాలు గెలిస్తే .... ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీలు కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మోడీని అధికారంలోకి రాకుండా చూడటమే కాంగ్రెస్ లక్ష్యంగా ఉన్నప్పుడు కచ్చితంగా కాంగ్రెస్ మాత్రం ఈ ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు ఇవ్వాల్సి పరిస్థితి తలెత్తుతుంది. ఎన్నికల కంటే ముందుగా పెట్టుకున్న పొత్తులతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే ఈ పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.180 నుంచి 190 స్థానాలకన్నా తక్కువగా బీజేపీకి వస్తే సంకీర్ణ ప్రభుత్వానికి కమలం పార్టీ నాయకత్వం వహించే ఛాన్సెస్ ఉంటాయి. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లలో కాంగ్రెస్ సగం సీట్లు గెల్చుకుంటే మోడీ-బీజేపీలకు కష్టాలు తప్పవు. ఎందుకంటే చాలా మటుకు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కే మద్దతు పలికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హంగ్ వస్తే మాయావతి మమతా బెనర్జీలు చక్రం తిప్పుతారా..?
ఒకవేళ హంగ్ పరిస్థితే వస్తే మాయావతి మమతా బెనర్జీలకు స్టాలిన్, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, కేసీఆర్, జగన్, తేజశ్వీ యాదవ్, సోపియా రాహుల్ గాంధీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ఇందులో మమతా బెనర్జీకే ఢిల్లీలో పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అదే సమయంలో సోనియా కూడా ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు పొత్తులపై సోనియా ఎక్కడా యాక్టివ్ రోల్ పోషించినట్లు కనిపించలేదు.
ఏది చేసిన తెరవెనక నుంచే ఆమె రాజకీయాలు నడిపారు. అదే సమయంలో రాహుల్ గాంధీని డామినేట్ చేయాలని కూడా ఎక్కడా అనిపించలేదు. ఇప్పటి వరకు తెరవెనక నుంచే మంత్రాంగం నడిపిన సోనియా మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత తెరపైకి వచ్చి యాక్టివ్ రోల్ పోషించే పాత్ర ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ప్రధాని పదవికి కన్విన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డేయేతర ప్రాంతీయ పార్టీలకు దిక్సూచి అవసరం. 1977లో జయప్రకాష్ నారాయణ్, లేదా వీపీ సింగ్, లేదా హర్కిషన్ సింగ్ సూర్జీత్ లాంటి నేతలు ముందుగా మాట వినలేదు. అలాంటి వారిని ఒప్పించే ప్రయత్నాలు నాడు జరిగాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని త్యాగం చేయాల్సిందిగా సోనియా కోరే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీ నేతలకు అవకాశం ఇచ్చేందుకు ఈ త్యాగం తప్పనిసరి అని రాహుల్ను కన్విన్స్ చేసే అవకాశం ఉంది.
సంకీర్ణంలో సోనియా గత అనుభవాన్ని వెలికి తీస్తారా..?
గతంలో డీఎంకే, ఎన్సీపీ లాంటి పార్టీ అధినేతలు ఈగోతో వ్యవహరించినప్పటికీ సోనియాగాంధీ ఎంటర్ అయి వారిని కన్విన్స్ చేసి తమకు మద్దతు తెలిపేలా పావులు కదిపి సక్సెస్ సాధించారు. 2004 నుంచి 2014 వరకు యూపీలో కాంగ్రెస్కు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు బద్ధ శత్రువులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం సోనియా వదులుకోలేదు. టచ్లోనే పెట్టుకున్నారు. ఇలా మే 23 తర్వాత ఫలితాలు కాస్త అటూ ఇటూ అయినా సోనియా ప్రవేశంతో సీన్ మారే అవకాశం ఉంది. సోనియా గాంధీ కూడా ఇప్పటి వరకు లోప్రొఫైల్ మెయింటెయిన్ చేసినప్పటికీ... ఫలితాల ప్రకటన తర్వాత నెంబర్ గేమ్ ఆధారంగా చక్రం తిప్పే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తరపున నుంచి ప్రధానిగా అభ్యర్థిని నిలబెట్టి ఇతరులను మద్దతు తెలపాల్సిందిగా కోరుతుందా... లేదా ఇతర పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ మద్దతు తెలిపేలా పావుల కదిపి విజయం సాధిస్తుందా అనేది తేలాల్సి ఉంది.