బతుకమ్మకు సోనియాకు నో: కెసిఆర్ దూరమే?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తొమ్మిది రోజుల పాటు భారీగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించడం లేదనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రదాత అయిన తమ నేత సోనియాను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఇప్పటికే కెసిఆర్పై గుర్రుమంటున్నారు. దేశంలోని మహిళా నాయకులందరినీ ఆహ్వానిస్తూ సోనియాను ఆహ్వానించకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు.
సోనియాను అహ్వానిస్తున్నట్లు గానీ ఆహ్వానిచండం లేదని గానీ ముఖ్యమంత్రి కెసిఆర్ గానీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గానీ చెప్పినట్లు లేదు. కానీ, సోనియాను అహ్వానించడం లేదనేది మాత్రం రూఢి అయినట్లు భావిస్తున్నారు. సోనియా గాంధీకి, కాంగ్రెసుకు క్రమంగా కెసిఆర్ దూరం జరగడం వల్లనే ఈ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు.
బతుకమ్మ పండుగకు సోనియా గాంధీ పట్టుదల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అలాంటి నాయకురాలిని ఆహ్వానించకుండా పండుగ చేయడం సరి కాదని కాంగ్రెసు మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డికె అరుణ, పద్మారెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీని బతుకమ్మ ఉత్సవాలకు ఆహ్వానించడం లేదనేది అర్థమవుతోంది.
బతుకమ్మ పండుగ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం పది కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ఉత్సవాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కెసిఆర్ తనయ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత భుజానికి ఎత్తుకుని నిర్వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.
జయలలిత, మమతా బెనర్జీ వస్తారా...
మహిళా ముఖ్యమంత్రులు జయలలిత, వసుంధర రాజే, ఆనందీ బెన్, మమతా బెనర్జీలను ఆహ్వానిస్తున్నట్లు కవిత శుక్రవారంనాడు చెప్పారు. అలాగే, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కూడా ఆహ్వానిస్తున్నారు. కేంద్ర మహిళా మంత్రులను, మహిళా గవర్నర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. కిరణ్ బేడీ వంటి మహిళా సామాజిక కార్యకర్తలను, మేధా పాట్కర్ వంటి మహిళా ఉద్యమకారులను, అరుంధతీ రాయ్ వంటి మహిళా రచయితలను బతుకమ్మ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. విదేశీ ప్రముఖురాలిని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. వారందరినీ స్వయంగా కెసిఆర్ ఆహ్వానిస్తారని సమాచారం.
పది వేల బతుకమ్మలు
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను హైదరాబాదులో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలనేది కెసిఆర్ అభిమతం. బతుకమ్మల ఊరేగింపు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమై ట్యాంక్బండ్కు చేరుకుంటుంది. దాదాపు 10 వేల బతుకమ్మలను ప్రభుత్వ సహకారంతో పేరుస్తారు. దాదాపు 25 వేల మంది మహిళలు ట్యాంక్బండ్పై జరిగే బతుకమ్మ పండుగలో పాల్గొంటారని భావిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ ప్రతీకగా బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణలో నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ జరుగుతోంది. ఈ బతుకమ్మ పండుగకు దేశంలోని మహిళా ప్రముఖులందరినీ ఆహ్వానిస్తూ సోనియాను ఆహ్వానించకపోవడం రాజకీయమైందేనని భావిస్తున్నారు.
కెసిఆర్పై తెలంగాణ కాంగ్రెసు నాయకులు విమర్శల దాడి పెంచడం కూడా అదే కోణంలో చూడాల్సి ఉంటుంది. ఎస్ జైపాల్ రెడ్డి, డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులు కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపి కన్నా మించి కాంగ్రెసు నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కెసిఆర్పై విరుచుకుపడుతున్నారు.