సారీ, తమిళనాడుకు నీళ్లివ్వలేం: సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటక
బెంగళూరు/న్యూఢిల్లీ: కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4టీఎంసీలు అదనంగా నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. తమిళనాడుకు అదనంగా నీరు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపింది.
'క్షమించండి. తమిళనాడుకు నీరు ఇవ్వలేం. ఒకవేళ తమిళనాడుకు నీరివ్వాలని మాకున్నా.. మా వద్ద అంత నీటి నిల్వ లేదు. కావేరీ బేసిన్లోకి నాలుగు కాల్వల నుంచి మొత్తం 9టీఎంసీల నీరు వస్తోంది. ఆ 9టీఎంసీలు మాకు తాగడానికి, పంట పొలాలకు సరిపోవడం లేదు' అని కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు.
అంతేగాక, 'మాకు నీటి కొరత ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతున్నాం. ఈ విషయం గురించి సుప్రీంకు వివరణ ఇస్తాం' అని కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు.
తమిళనాడులో కావేరీ యాజమాన్య బోర్డు నిర్వహించాలని కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మే 4నాటికి ముసాయిదాను అందించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా.. ముసాయిదాను ప్రవేశపెట్టలేకపోయారని కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు మే8కి వాయిదా వేసింది.