ఆత్మరక్షణలో సీఎం పళనిసామి: మంత్రిపై వేటుకు సిద్దం, కొంప మునిగితే !
చెన్నై: ఆదాయపన్ను శాఖ దాడులతో పీకల్లోతుల్లో కూరుకుపోయిన తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ను మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వెలుగు చూసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తనకు అందుబాటులో ఉన్న సహచర మంత్రులతో కలసి ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ విషయంపై చర్చించారని సమాచారం.
ప్రభుత్వానికే చెడ్డపేరు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా నగదు బట్వాడా జరిగిందని ఐటీ శాఖ అధికారులు ఆరోపిస్తున్న సమయంలో మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరురాకుండా చూడాలని పలువురు మంత్రులు సీఎం ఎడప్పాడి పళనిసామికి సూచించారని తెలిసింది.
ఒక్కరి కోసం అందరూ అయితే ఎలా !
ఐటీ శాఖ అధికారులు ఇప్పటికే ఆరు మంది మంత్రులకు సమన్లు జారీ చేశారు. ఈ సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారుల విచారణకు గురైన మంత్రి విజయభాస్కర్ విషయంలో మౌనంగా ఉంటే మొదటికే మోసం వస్తోందని సహచర మంత్రులు ఆందోనళ వ్యక్తం చేశారని సమాచారం.
వేటు పడితే సీన్ రివర్స్ అవుతుందా ?
ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ మీద వేటు వేస్తే ఆయన ఎదురుతిరిగే అవకాశం ఉందని సమాచారం. విజయభాస్కర్ నోరువిప్పితే మొదటికే మోసం వస్తుందని మరి కొందరు మంత్రులు ఎడప్పాడికి చెప్పారని తెలిసింది.
న్యాయనిపుణులతో
ఆదాయపన్ను శాఖ అధికారులు విజయభాస్కర్ మీద చర్యలు తీసుకోక ముందే ఆయన మంత్రి పదవి మీద వేటు వెయ్యడం మంచిదని ఎడప్పాడి పళనిసామి భావిస్తున్నారని సమాచారం. అయితే ఒకటి రెండు రోజులు వేచి చూద్దామా ? వద్దా ? అనే విషయంపై చర్చకూడా జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది.
మొదటికే మోసం వస్తే ఏలా ?
మంత్రి విజయభాస్కర్ కారణంగా తమిళనాడు ప్రభుత్వానికి ఎసరు వస్తే కొంప మునిగిపోతుందని పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. న్యాయనిపుణులతో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని ఎడప్పాడి మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని శశికళ వర్గంలోని నాయకులు అంటున్నారు.