దక్షిణాదిపై పునర్విభజన దెబ్బ ? భారీగా ఎగిరిపోతున్న లోక్ సభ సీట్లు ? తెలుగు రాష్టాల్లో ఇలా..
కేంద్ర ప్రభుత్వం వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత చేపట్టబోతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ దేశవ్యాప్తంగా పెనుమార్పులకు కారణం కాబోతోంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలపై మరింత ప్రభావం పడబోతోంది. జనాభా ఆధారంగా నియోజవర్గాల పునర్విభజన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు భారీగా లోక్ సభ సీట్లను కోల్పోతున్నాయి.
కేంద్రం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం జనాభా ఆధారంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దాని ప్రభావం దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై ఎక్కువగా పడబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై జాతీయ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూపు తాజాగా ఓ కథనం వెలువరించింది. ఇందులో పునర్విభజన కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లలో ఏకంగా ఎనిమిది చొప్పున సీట్లను కోల్పోతున్నాయి.

అలాగే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ లోక్ సభ సీట్ల సంఖ్య నాలుగు చొప్పున తగ్గబోతోంది. అసలే పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్లు, లోక్ సభ సీట్లు పెరుగుతాయని అంచనాల్లో ఉన్న పార్టీలకు ఈ లెక్కలు షాకులిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటి వారు జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టడానికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కలు బయటికి వస్తే దక్షిణాది మొత్తంగా ఈ ప్రక్రియను వ్యతిరేకించినా ఆశ్చర్యం లేదు.
పునర్విభజన జరిగితే తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్ల నుంచి 31కి సీట్లు తగ్గుతాయి. అలాగే ఏపీలో 25 సీట్లు కాస్తా 21 అవుతాయి. తెలంగాణలో 17 సీట్లు కాస్తా 13 అవుతాయి. కేరళలో 20 సీట్లు కాస్తా 12 అవుతాయి. బెంగాల్లో 42 సీట్లు కాస్తా 38కి తగ్గుతాయి. ఒడిశాలో 21 సీట్లు కాస్తా 18 అవుతాయి. కర్నాటకలో మాత్రం 28 సీట్లు 26 కానున్నాయి. హిమాచల్ లో 4 సీట్లు 3కు, పంజాబ్ లో 13 సీట్లు 12కు, ఉత్తరాఖండ్ లో 5 సీట్లు 4కు తగ్గుతాయి.
కానీ అసోంలో ప్రస్తుతం ఉన్న 14 సీట్లలో ఎలాంటి మార్పూ రావడం లేదు. మహారాష్ట్రలోనూ 48 సీట్లు అలాగే ఉండబోతున్నాయి. ఛత్తీస్ ఘడ్ లో 11 సీట్లు 12 కాబోతున్నాయి. ఢిల్లీలో 7 సీట్లు 8కి పెరగనున్నాయి. గుజరాత్ లో 26 సీట్లు 27కు పెరుగుతాయి. హర్యానాలో 10 కాస్తా 11కు, జార్ఖండ్ లో 14 కాస్తా 15కు, మధ్యప్రదేశ్ లో 29 కాస్తా 33కు, రాజస్తాన్ లో 25 కాస్తా 31కి, బీహార్లో 40 కాస్తా 50కి, ఉత్తర్ ప్రదేశ్ లో 80 కాస్తా 91కి పెరగబోతున్నాయి. దీంతో ఈ పునర్విభజన ప్రక్రియ వివాదాస్పదంగా మారే అవకాశముంది.












Click it and Unblock the Notifications