దక్షిణాదిలో రాజ్యాంగ వివాదం..! బడ్జెట్ స్పీచ్ లు బాయ్ కాట్ చేస్తున్న గవర్నర్లు..!
భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లో తాజా రాజ్యాంగ వివాదం ఏర్పడుతోంది. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో గవర్నర్లు తమకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రసంగాల్ని చదవకుండానే మధ్యలో ఆపేసి వెళ్లిపోతున్నారు. లేదా తమకు నచ్చని విషయాల్ని చదవకుండా వెళ్లిపోతున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ అసెంబ్లీల్లో చోటు చేసుకున్న ఈ ఘటనలకు కొనసాగింపుగా ఇవాళ కర్నాటక అసెంబ్లీలోనూ ఇలాంటి పరిణామం జరిగింది.
ఇవాళ కర్నాటక అసెంబ్లీలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని భాగాల్ని చదివేందుకు నిరాకరించారు. ఉపాధి హామీ చట్టం (నరేగా) స్ధానంలో కేంద్రం తెస్తున్న జీ రామ్ జీ బిల్లు అమలుకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం చేసిన సూచనల్ని వ్యతిరేకిస్తూ ఇలా గవర్నర్ తన బడ్జెట్ సమావేశాల ప్రసంగం ఆపేసి మధ్యలో వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికీ, గవర్నర్ కూ మధ్య గ్యాప్ బయటపడింది.

ఇవాళ కర్నాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ప్రభుత్వ విధానాల, ప్రాధాన్యతలను వివరిస్తూ ప్రసంగించాల్సి ఉంది. అయితే ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సరిదిద్దడానికి ఉద్దేశించిన కేంద్ర చట్టాన్ని ప్రస్తావించే కొన్ని పేరాలను చదివేందుకు గెహ్లాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రసంగం ప్రభుత్వ ప్రచారమని వాదించారు. చివరికి చదవకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలోనూ తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి నిన్న ఇలాగే అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదవకుండానే అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారరు. మరోవైపు కేరళలోనూ తాజాగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించారని,తాను సూచించిన మార్పులు బడ్జెట్ ప్రసంగంలో లేవని ఆరోపిస్తూ వాటిని చదివేందుకు నిరాకరించారు. తద్వారా మూడు దక్షిణాది రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాల సూచనల్ని గవర్నర్లు పట్టించుకునేందుకు నిరాకరించినట్లయింది.












Click it and Unblock the Notifications