దక్షిణాది రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు షురూ
బెంగళూరు: ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తాజాగా పలు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఆదివారం కర్ణాటక తీరం, గోవా అంతటా, మహారాష్ట్రలో కొంత బాగం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాస్ట్రాలో కొత్త భాగం, తమిళనాడులో చాలా భాగం ప్రవేశించాయి.
రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా భాగాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఆదివారం గాలులు నైరుతి దిశగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయి. రాగల మూడు రోజులపాటు(జూన్ 5,6,7 తేదీల్లో) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈరోజు, రేపు తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లో, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్నాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది.
కాగా, రుతుపవనాలు ప్రవేశించడంతో కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్రల్లో వర్షాలు నేటి నుంచి కురుస్తున్నాయి. బెంగళూరులో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో శుక్రవారం సాయంత్రం 45 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు రెండ్రోజుల క్రితం కేరళను తాకడంతో ఆ రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి.