ఏపీ, తెలంగాణలో విస్తరిస్తున్న రుతుపవనాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు అన్ని జిల్లాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలు కూడా వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకిన రెండ్రోజుల్లోనే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సంగం గ్రామంలో 15.9 సెం.మీ, ఉడిత్యాల(మహబూబ్నగర్)లో 15.6, తోటపల్లి(నాగర్కర్నూల్)లో 13.6, కందుకూరులో 13.1, ఆమన్గల్లో 12.6, వనపర్తిలో 12.5 మీర్కాన్పేటలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం పగలు కూడా పలు ప్రాంతాల్లో 6 సెం.మీ.ల వరకూ వర్షపాతం నమోదైంది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై.. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి.

తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు
కాగా, రుతుపవనాలు హైదరాబాద్, మెదక్ సహా మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని పేర్కొంది. ఉత్తర్ప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉత్తర-దక్షిణ ఉపరితలద్రోణి ఏర్పడింది. దీంతో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.రాష్ట్రంలో బుధవారం కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఏపీలోనూ విస్తరిస్తున్న రుతుపవనాలతో వర్షాలు
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతోపాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. కృష్ణా, ఏలూరు జిల్లాల వరకు వీటి ప్రభావం కన్పిస్తోంది.
Recommended Video


రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేశారు. కాగా, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి రాత్రి వరకు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో 63.5 మి.మీ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జి మండలం విజయరాంపురంలో 63, పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో 42.మి.మీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఉత్సాహంగా వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు.












Click it and Unblock the Notifications