రెండ్రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు: ఇక వర్షకాలం మొదలు
న్యూఢిల్లీ: రెండ్రోజుల ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో నాలుగు నెలల వర్షాకాలం మొదలవుతోంది.
ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. వాస్తవానికి జూన్ 1నే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రోజుల ఆలస్యంగా గురువారం కేరళను తాకాయి.
ఈ క్రమంలో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం, శుక్రవారం వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మనదేశంలో దాదాసు సంగం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు వర్షాధారమైనవే కావడం గమనార్హం.
ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. గత రెండేళ్లుగా (2019, 2020) దేశంలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇటీవల వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడనున్నాయి.