గుడ్న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి అడుగు - ఎస్పీ చరణ్ తాజా వీడియో
లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయనడానికి సంకేతంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పాట పాడేందుకు ప్రయత్నించారన్న శుభవార్తను ఆయన కొడుకు ఎస్పీ చరణ్ తెలియజేశారు. కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయకుడి ఆరోగ్యం కాస్త మెరుగైందని చరణ్ బుధవారం నాటి వీడియో అప్ డేట్ లో ప్రకటించారు. ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు సైతం చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని తెలిపాయి. కరోనాతో ఈనెల 5న బాలు ఆస్పత్రిలో చేరగా, రెండో వారంలో పరిస్థితి కాస్త విషమించి, మూడో వారానికి కాస్త కుదుటపడింది.

రికవరీలో తొలి అడుగు..
గడిచిన రెండు రోజుల కంటే బుధవారం నాటికి బాలు ఆరోగ్యం కొంత మెరుగుపడిందని కొడుకు ఎస్పీ చరణ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడానని, నిన్నటి కంటే ఈరోజు ఆయన ఊపిరితిత్తుల పరిస్థితి మెరుగ్గా ఉందని, మత్తు కూడా లేదని, తద్వారా అనారోగ్యం నుంచి కోలుకునే క్రమంలో తొలి అడుగు పడిందని డాక్టర్లు చెప్పినట్లు చరణ్ పేర్కొన్నారు. బాలుగారు తక్షణమే కోలుకోనప్పటికీ, నెమ్మదిగానైనా తిరిగి మామూలు స్థితికి వస్తారన్న నమ్మకం పెరిగిందని తనయుడు అన్నారు.

పాట పాడేందుకు ప్రయ్నతం..
‘‘ఈ రోజు నేను నాన్న గదిలోకి వెళ్లేసరికి ఆయన మెలకువగానే ఉన్నారు. నిన్నటి కంటే ఎంతో మెరుగ్గా కనిపించారు. నాతో ఏదో చెప్పడానికి ట్రై చేశారు. పేపర్ మీద పెన్నుతో రాసే ఓపిక లేక ఆ ప్రయత్నాన్ని వదిలేశారు. అయితే, వారం రోజుల్లో ఆయన మాట్లాడే స్థితికి వస్తారని డాక్టర్ల భరోసాతో నమ్మకం ఏర్పడింది. నాన్న కోసం ప్రతిరోజు న్యూస్ పేపర్లు చదివించాలని డాక్టర్లను కోరాను. ప్రస్తుతం ఆయన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. దానికి తగ్గట్టుగా శరీరాన్ని కదుపుతున్నారు. పాడటానికి కూడా ప్రయత్నించారు. ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అని ఎస్పీ చరణ్ తన వీడియోలో చెప్పారు.

ఆస్పత్రిలో వేదపారాయణం..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగైందని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు డాక్టర్ అనురాధ భాస్కరన్ బుధవారం బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నదని, బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని తెలిపారు. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందన్నారు. బాలు చికిత్స పొందుతున్న ఎమర్జెన్సీ విభాగం కింది అంతస్తులో ప్రతి రోజూ వేద పండితులు వేదపారాయణం చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని బాలు చికిత్స పొందుతున్న గదిలో ఉన్న టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని బులిటెన్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications