కర్ణాటక ముగ్గురు ఎంపీల రాజీనామా: ఓకే చెప్పిన స్పీకర్: మూడు స్థానాలు ఖాళీ, మూడు పార్టీలు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన ముగ్గురు లోక్ సభ సభ్యుల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మే 29వ తేదీ మంగళవారం అంగీకరించారు. కర్ణాటకలోని మూడు లోక్ సభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మూడు లోక్ సభ స్థానాల మీద పలువురు నాయకులు కన్నేశారు. మూడు పార్టీలు పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యాయి.
Recommended Video
బీజేపీ ఎంపీలు
కర్ణాటకలోని శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీ అయిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బళ్లారి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీ అయిన కర్ణాటక మాజీ మంత్రి బి. శ్రీరాములు తన పదవికి రాజీనామా చేశారు.
జేడీఎస్ ఎంపీ
మండ్య లోక్ సభ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ టిక్కెట్ తో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన సీఎస్. పుట్టరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మేలుకోటే శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సీఎస్. పుట్టరాజు విజయం సాధించారు. కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎస్. పుట్టరాజుకు మంత్రి పదవి దాదాపు ఖరారు అయ్యింది.
బీజేపీ ఎమ్మెల్యేలు
శివమొగ్గ లోక్ సభ సభ్యుడు, బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప శికారీపుర శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బళ్లారి ఎంపీ శ్రీరాములు మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
మూడు పార్టీలు సై
శివమొగ్గ, బళ్లారి, మండ్య లోక్ సభ స్థానాల ఎంపీల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధికారికంగా అంగీకరించారు. మూడు లోక్ సభ స్థానాలు ఖాళీ అయ్యాయని అధికారికంగా ప్రకటించడంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ఆ స్థానాలలో పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్నాయి.