సిద్ధి వినాయక ఆలయంలో వేదనగా, కంటతడి, తెలుగువారంటే..: ‘ఆలస్యం’పై ఫ్యాన్స్ అసహనం
ముంబై: దిగ్గజ సినీ నటి శ్రీదేవి మరణాన్ని ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. సోమవారం రాత్రి వరకు ఆమె భౌతిక కాయాన్ని ముంబైకి తీసుకొస్తారనే వార్తలు రావడంతో భారీగా అభిమానులు ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు చేరుకున్నారు.
Recommended Video
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్లకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ముంబై చేరుకున్నారు. అయితే, శ్రీదేవి మృతిపై మరింత విచారణ జరపాలని పోలీసులు, ప్రాసిక్యూషన్ ఆమె మృతదేహాన్ని దుబాయి నుంచి తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో మంగళవారం విచారణ పూర్తయితే భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది.
తెలుగువారంటే అభిమానం
కాగా, ముంబైలోని శ్రీదేవి నివాసానికి భారీ సంఖ్యలో తెలుగు సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు చేరుకున్నారు. శ్రీదేవి పార్థీవ దేహాన్ని చూసేందుకు వచ్చామని తెలిపారు. తెలుగువారంటే శ్రీదేవికి ప్రత్యేక అభిమానమని వారు చెప్పారు. తాము ఎప్పుడు వెళ్లినా ఎంతో అప్యాయంగా పలకరించేవారని తెలిపారు. కాగా, శ్రీదేవి మృతిపై తమకు కూడా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మొదట గుండెపోటని, ఆ తర్వాత మద్యం తాగిన మైకంలో బాత్రూం వాటర్ టబ్బులో పడిచనిపోయిందంటున్నారని చెప్పారు.
శ్రీదేవి మృతిపై లోతుగా.! బోనీ కపూర్ నిర్బంధం, పాస్పోర్ట్ సీజ్: ఏం జరుగుతోంది?
సిద్ధి వినాయక గుడిలో వేదనగా..
కాగా, గత ఆరు నెలల వరకు కూడా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి శ్రీదేవి ప్రతీ మంగళవారం వచ్చేవారని తెలుగు సంఘాల నాయకులు కొందరు తెలిపారు. అప్పుడప్పుడు ఏదో తెలియని వేదనతో బాధ పడుతూ కనిపించేవారని తెలిపారు. అంతేగాక, పలుమార్లు ఆలయంలో కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. కాగా, గత కొంతకాలంగా శ్రీదేవి కుటుంబం ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు లోనైనట్లు తెలుస్తోంది.
శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించలేం: షాకిచ్చిన ఫోరెన్సిక్, ‘మద్యం'పై అనుమానం
అభిమానుల అసహనం
ఇది ఇలావుండగా, శ్రీదేవి భౌతికకాయం అప్పగింతలో జరుగుతున్న జాప్యంపై బాలీవుడ్ వర్గాలు, అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి శ్రీదేవి మరణిస్తే సోమవారం రాత్రికి కూడా భౌతికకాయం ముంబై చేరుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీసుకొస్తారనుకుంటే..
శ్రీదేవి మృతిపై తొలుత కొన్ని సందేహాలు వ్యక్తమైనా పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆమె మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని యూఏఈ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫోరెన్సిక్ నివేదిక, మరణ ధ్రువీకరణం పత్రం శ్రీదేవి కుటుంబ సభ్యులకు, భారత దౌత్య అధికారులకు అందిన తర్వాత వెంటనే భౌతికకాయాన్ని ముంబైలోని ఆమె స్వస్థలానికి తీసుకొస్తారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు.
సందేహాలు
దుబాయ్ పోలీసులు శ్రీదేవి మృతి కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేయడంతో భౌతికకాయం ముంబై చేరుకోవడానికి మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి మృతి వెనుక కుట్ర లేదని, ప్రమాదవశాత్తూ జరిగిందని యూఏఈ ఆరోగ్యశాఖ స్పష్టం చేసిన తర్వాత కూడా దుబాయ్ పోలీసులు భౌతికకాయాన్ని తరలించేందుకు అనుమతించకుండా, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీచేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా దర్యాప్తు జరపాలంటూ శ్రీదేవి భౌతిక కాయాన్ని ఇప్పుడే అప్పగించలేమని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు తేల్చి చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత మంగళవారం రాత్రి వరకు శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.