పన్నీర్కు డీఎంకె మద్దతు? తమిళ పాలిటిక్స్లో ఎడతెగని ఉత్కంఠ..
అటు స్టాలిన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన సమయంలోనే ఇటు పన్నీర్ కూడా తన మద్దతుదారులతో భేటీ అయ్యారు.
చెన్నై: అర్థరాత్రి జయ సమాధి వద్ద మౌనదీక్ష.. ఆ అనంతరం మీడియాతో సంచలనాత్మక వ్యాఖ్యలతో పన్నీర్ సెల్వం ఎగరేసిన తిరుగుబాటు బావుటా ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
క్షణ క్షణానికి మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. తమిళ సీఎం పీఠంపై ఎడతెగని ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య పోటీలో.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు.. ఎవరి శక్తి మేర వారు ప్రయత్నిస్తున్నారు.
ఎవరి మద్దతు లేకపోయినా.. ఒంటరిగానైనా తన పోరాటం ఆగబోదని పన్నీర్ సెల్వం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రతిపక్షం డీఎంకె మద్దతు ఆయనకు ఉండబోతుందా? అన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టాలిన్ కు పన్నీర్ సెల్వంకు మధ్య సత్సంబంధాలు ఉండటం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
అటు స్టాలిన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన సమయంలోనే ఇటు పన్నీర్ కూడా తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీల పైనే అందరు దృష్టి సారించారు. మొత్తం మీద శశికళ-పన్నీర్ మధ్య పార్టీ నిలువునా చీలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం పన్నీర్ సెల్వంతో కలిపి అన్నాడీఎంకెకు 134 మంది, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్కు 8 మంది, 2 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. అన్నాడీఎంకెలో చీలిక అంటూ జరిగితే.. చివరగా సీఎం పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారన్నది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠను రేపుతోన్న అంశం.