ద్రవిడ పార్టీలపై పట్టుకు కొత్త నాయకుల ప్రయత్నాలు, ఎవరిది పై చేయి?
తమిళనాడు రాష్ట్రంలోని రెండు ద్రవిడ పార్టీల్లో కొత్త నాయకత్వాలు పార్టీలపై తమ పట్టును పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
చెన్నై :అన్నాడిఎంకెలో నాయకత్వ మార్పు తర్వాత డిఎంకెలో కూడ నాయకత్వ మార్పు జరిగింది. ఈ మేరకు డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ బాద్యతలను అప్పగించారు. అయితే కరుణానిధి కుటుంబసభ్యుల మద్య ఐక్యత కన్పిస్తోంది. అళగిరి, కనిమొళి, స్టాలిన్ వర్గాల మద్యసఖ్యత కన్పిస్తోంది.అన్నాడిఎంకెలో శశికళ ఆధిపత్యాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది.
తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు కొత్త నాయకులు వచ్చారు. జయలలిత మరణంతో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి బాద్యతలను శశికళ చేపట్టారు.పార్టీ బాద్యతలతో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడ ఆమె చేపట్టాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.
మరో వైపు డిఎంకె పార్టీలో కూడ నాయకత్వ మార్పులు చోటుచేసుకొన్నాయి. డిఎంకె చీఫ్ కరుణానిధి తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నందున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్యతలను స్టాలిన్ కు అప్పగించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వంకు త్వరలోనే శశికళ చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదు. పన్నీర్ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోనుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్టీ నాయకులంతా పాలన పగ్గాలు చేపట్టాలని శశికళను కోరుతున్నారు.
డిఎంకెలో మూడు గ్రూపుల ఐక్యత
డిఎంకె లో స్టాలిన్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అనుకొన్నట్టుగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్యలను ఆయనకు అప్పగించారు.అయితే పార్టీ నుండి బహిష్కరణ వేటు పడిన స్టాలిన్ సోదరుడు అళగిరిపై బహిష్కరణ వేటు ను ఎత్తివేస్తారని ప్రచారం జరిగింది, కాని, ఇంతవరకు ఈ విషయమై పార్టీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరో వైపు కనిమొళికి కూడ పార్టీలో మంచి పదవి దక్కే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. అయితే స్టాలిన్ కు మినహ మిగిలిన ఇద్దరికి మాత్రం పార్టీ పదవులు దక్కలేదు.అయితే ఈ ముగ్గురి మద్య ఐక్యత కన్పిస్తోంది. స్టాలిన్ కు పార్టీ కీలకమైన పదవి దక్కిన తర్వాత మిగిలిన ఇద్దరి నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.
నిబంధనల్లో మార్పులతో పార్టీ పై స్టాలిన్ కు సర్వాధికారాలు
నిబంధనల్లో మార్పులతో పార్టీపై స్టాలిన్ కు పార్టీపై సర్వాధికారాలు వచ్చాయి.పార్టీలోని చట్ట నిబంధనను 18ని సవరించారు. ఈ సవరణ ద్వారా పార్టీ అధ్యక్షుడి అధికారాలన్నీ స్టాలిన్ కు సంక్రమించాయి. దీంతో పార్టీలోని అన్ని విబాగాలపై స్టాలిన్ కు పట్టు ఏర్పడింది. అయితే తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలోని 18 జిల్లాల్లో అళగిరికి పట్టుంది. కనిమొళి వర్గంతో కూడ స్టాలిన్ కలిసిపోతున్నాడు. ఈ మేరకు స్టాలిన్ వ్యూహరచన చేస్తున్నారు.
పార్టీపై పట్టుకోసం శశికళ పావులు
అన్నాడిఎంకె పార్టీలో పట్టు సాధించేందుకుగాను శశికళ పావులు కదుపుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆమె జిల్లాల వారీగా పార్టీ సమీక్షలను ప్రారంభించారు. పార్టీ బలాన్ని సమీక్షిస్తున్నారు. ఈ మేరకు పార్టీపై పట్టు బిగిస్తే రానున్న ఎన్నికల్లో తన పని మరింత సులువు అవుతోందనే అభిప్రాయంతో శశికళ ఉన్నారు.
స్టాలిన్ వర్సెస్ శశికళ
రెండు ద్రవిడ పార్టీలకు కొత్తనాయకత్వాలు వచ్చాయి. అన్నాడిఎంకె పార్టీకి ప్రథాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. స్టాలిన్ డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రోజునే ఆ పార్టీ జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మాణం కూడ చేసింది.అయితే అన్నాడిఎంకె ప్రభుత్వ హయంలోనే జల్లికట్టు పై నిషేధం విధించారని స్టాలిన్ ఆరోపించాడు.అయితే ఈ ఆరోపణలకు శశికళ ఘాటుగానే స్పందించారు. డిఎంకె నాయకత్వంలోని యూపిఏ ప్రభుత్వం హయంలోనే జల్లికట్టుపై అప్పటి కేంద్రం నిషేధాన్ని విధించారని ఆమె తిప్పికొట్టింది.