మంత్రికి చేదు అనుభవం: పాట్నాతొక్కిసలాట (పిక్చర్స్)
పాట్నా: దసరా రోజున బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన రావణ వధ కార్యక్రమం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి రావణ వధ కార్యక్రమం చూడటం కోసం లక్షల సంఖ్యలో గాంధీ మైదానానికి తరలి వచ్చిన జనం, కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో 33మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఘటనా ప్రాంతంలో 32మంది చనిపోగా, శనివారం పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు. చనిపోయిన వారిలో 12మంది మహిళలు, పది మంది చిన్నారులు ఉన్నారు.
ఇదిలా ఉండగా సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని బిజెపి సహా ప్రతిపక్షాలన్నీ ధ్వజమెత్తడం మొదలుపెట్టాయి. ప్రతిపక్షాల ఆరోపణలను అర్థం లేనివిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజి కొట్టి పారేశారు. జనం బైటికి వెళ్లడానికి నాలుగు గేట్లను తెరవడం జరిగిందని, సిసి టీవీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
తొక్కిసలాట
శనివారం పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మరో వ్యక్తి చనిపోవడంతో సంఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 33కు చేరుకుందని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అమీర్ సుభానీ చెప్పారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చిన 29మంది క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. శనివారం మధ్యాహ్నం సంఘటన జరిగిన గాంధీ మైదాన్ను సందర్శించడంతో తొక్కిసలాటపై దర్యాప్తు ప్రారంభమైనట్టు ఆయన చెప్పారు.
తొక్కిసలాట
సంఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సుభానీ, అదనపు డిజిపి గుప్తేశ్వర్ పాండేలతో ద్విసభ్య కమిటీని నియమించడం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిటీ కంటితుడుపు చర్య మాత్రమేనని కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ విమర్శించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వచ్చిన జనంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలవని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నందకిశోర్ యాదవ్ అన్నారు.
తొక్కిసలాట
కార్యక్రమం తర్వాత మొత్తం అధికార యంత్రాంగం ముఖ్యమంత్రిని అక్కడినుంచి పంపించడంపై దృష్టిపెట్టి లక్షలాదిమందిని వాళ్ల మానానికి వదిలేసిందని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ విమర్శించారు. కాగా, శుక్రవారం సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం మరోసారి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి కేంద్రం తరఫున అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
తొక్కిసలాట
శనివారం పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రామ్ధని సింగ్కు బాధితుల బంధువుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆస్పత్రినుంచి బైటికి వస్తున్న మంత్రిని అడ్డుకుని 16 గంటల తర్వాత ఇక్కడికి ఎందుకొచ్చావంటూ కారును చుట్టుముట్టి నిలదీసారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అతికష్టం మీద మంత్రిని అక్కడినుంచి పంపించి వేశారు.
తొక్కిసలాట
కాగా, జనం ఊపిరాడకపోవడం వల్లే చనిపోయినట్లు కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ మనీశ్ కుమార్ వర్మ, ఎస్పి మను మహరాజ్ ఆస్పత్రి వద్ద విలేకరులతో అన్నారు. కుట్రలో భాగంగా పుకార్లు వ్యాప్తి చేశారని, పెద్ద పేలుడు తర్వాత కరెంటు తీగ తెగిపడిందని రకరకాల కథనాలు ఉన్నప్పటికీ దర్యాప్తు తర్వాత మాత్రమే తొక్కిసలాటకు కారణాలు తెలుస్తాయని అధికారులు చెప్తున్నారు