One Nation One Ration Card: రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: అమలుకు డెడ్లైన్ ఫిక్స్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల ఉపాధిని కోల్పోయిన వలస కార్మికుల కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకానికి సంబంధించిన ఆదేశాలు అవి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా వలస కార్మికులకు ఉన్నచోటే చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందజేయాలని సుప్రీంకోర్టు తాజాగా సూచనలు ఇచ్చింది.

జులై 31వ తేదీ నాటికి..
ఈ వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనికి డెడ్లైన్ కూడా విధించింది. జులై 31వ తేదీ నాటికి ఈ పథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు- వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని సూచించింది.

పోర్టల్ ద్వారా నమోదు..
అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, వసల కూలీల వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా ఓ పోర్టల్ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జులై 31వ తేదీ నాటికి ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. డిమాండ్లకు అనుగుణంగా.. ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను రాష్ట్రాలకు సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాంట్రాక్టర్ల వివరాలు కూడా..
జులై 31వ తేదీ నాటికి డ్రై రేషన్ను చేపట్టాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సమసిపోయేంత వరకూ దాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయని రాష్ట్రాలు తాము విధించిన డెడ్లైన్ నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని పేర్కొంది. అంతర్రాష్ట్ర వలస కార్మికులు (రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్)-1979 కింద కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కంపెనీల వివరాలన్నింటినీ నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది.

కమ్యూనిటీ కిచెన్లు సైతం..
వలస కార్మికుల సంక్షేమం కోసం కమ్మూనిటీ కిచెన్లను అందుబాటులోకి తీసుకుని రావాలని, కరోనా సంక్షోభం ముగిసేంత వరకూ వాటిని కొనసాగించాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి రాష్ట్రాలు లాక్డౌన్ను విధించడం వల్ల వలస కార్మికులు ఉపాధిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఫలితంగా- వారు వందలాది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకున్నారు.

సుమోటోగా స్వీకరణ..
దీన్ని గత ఏడాది మేలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టింది. తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులకు ఉన్నచోటే ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ఇప్పటికే జాప్యమైందని న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీన్ని వెంటనే అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. దానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి జులై 31వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications