కాశ్మీర్లో రాళ్లు రువ్వే కేసులు తగ్గుముఖం పట్టాయి: రాజ్
ఎన్ఐఏ కారణంగా జమ్ము కాశ్మీర్లో రాళ్లు రువ్వుతున్న ఘటనలు బాగా తగ్గిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. గత మూడేళ్లలో నక్సలిజం, ఉగ్రవాదం వంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
న్యూఢిల్లీ: ఎన్ఐఏ కారణంగా జమ్ము కాశ్మీర్లో రాళ్లు రువ్వుతున్న ఘటనలు బాగా తగ్గిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. గత మూడేళ్లలో నక్సలిజం, ఉగ్రవాదం వంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
కాశ్మీర్లో ఎన్ఐఏ పోషించిన పాత్రను అందరూ చూశారని, దేశ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, అందుకోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
ఆదివారం ఆయన లక్నోలో మాట్లాడారు. నక్సలిజం, ఉగ్రవాదం, అతివాదంపై తాము విజయం సాధిస్తామన్నారు. గత మూడేళ్లలో ఈశాన్యంలో అతివాదం 75 శాతం మేర తగ్గుముఖం పట్టిందన్నారు. నక్సలిజం 35-40 శాతం మేర తగ్గిందన్నారు.
ఉగ్ర నిధుల వనరులను అడ్డుకుంటామన్నారు. నకిలీ కరెన్సీ, ఉగ్రవాద నిధుల మూలాలను నిర్మూలిస్తే అది ఉగ్రవాదానికి చావు దెబ్బ అవుతుందన్నారు. ఈ అంశంలో ఎన్ఐఏ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఫలితంగా ఉగ్ర నిధులకు దోహదపడేవారికి దడ పుడుతోందన్నారు.