కేజ్రీపై రాళ్ల దాడి: విందుకు 20వేలు, ఇల్లు ఖాళీకి ఆదేశం
అహ్మదాబాద్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్లో నిరసనల సెగ తగులుతోంది. అహ్మదాబాదులో కేజ్రీవాల్ నిర్వహించిన ర్యాలీలో శనివారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. కాగా, కొంతమంది నిరసనకారులు కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న సమయంలో స్టేజీ పైకి దూసుకు వెళ్లారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే కేజ్రీవాల్ ర్యాలీకి బయట పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కాగా మూడ్రోజుల్లో ఇది నాలుగో దాడి అని కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్లో అభివృద్ధి జరిగిందేమీ లేదని, రాష్ట్రంలో మార్పు చాలా అవసరమని ఆయన చెప్పారు. మోడీ పదేళ్లలో చేయలేని పనిని ఎఎపి ప్రభుత్వం 49 రోజుల్లో చేసిందన్నారు.
కేజ్రీతో విందుకు రూ.20వేలు
కేజ్రీవాల్తో విందు చేయాలనుకుంటే రూ.20వేలు చెల్లించవలసి ఉంటుంది. పార్టీకి నిధులు సమీకరించే ఉద్దేశ్యంలో భాగంగా... పార్టీ అధినేతతో విందుకు ప్లాన్ చేశారు. మార్చి 15న ఓ హోటల్లో ఈ విందు ఏర్పాటు చేశారు. ఇది ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఎఎపి సభ్యులు వి బాలకృష్ణన్ ఆలోచన అని తెలుస్తోంది. దీనికి ఐటి, ప్రయివేటు ఈక్విటీ పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టుల వంటి బడా బడా వ్యక్తులు 200 మందిని ఆహ్వానిస్తున్నారట.
ఇల్లు అప్పగించండి
మాజీసిఎం అరవింద్ కేజ్రీవాల్కు తిలక్ మార్గ్లో కేటాయించిన ఇంటిని అప్పగించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఫిబ్రవరి 14న రాజీనామా చేసిన కేజ్రీవాల్ నిబంధనల ప్రకారం 15 రోజుల తర్వాత ఆ ఇంటిని ఖాలీ చేయాల్సి ఉంది. ఒకవేళ ఇంకా ఆ ఇంటిలో నివసిస్తే అద్దె చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.