చెత్తలా నన్ను బయటపడేశారు: సుజాతా సింగ్ ఆవేదన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తనను పదవినుంచి తొలగించిన తీరుపై విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుజాతా సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన పరువును గంగపాలు చేశారని, తనను చెత్తలా బయట పారేశారని ఆమె బాధపడ్డారు. ఇంత అవసరం ఎందుకొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఎన్డీటీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి మీడియాలో వార్తాకథనాలు రాయించారని ఆమె ఆరోపించారు. 39 ఏళ్లు పనిచేసిన తన పరువును తీయడానికి పూనుకున్నారని ఆమె విమర్శిచారు.
ఏడు నెలల్లో పదవీ విరమణ ఉందనగా, సుజాతాసింగ్ను బుధవారం రాత్రి పదవినుంచి మోడీ ప్రభుత్వం తొలగించింది. ఆమె స్థానంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న జయశంకర్ను నియమించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఎన్డీటీవీ సుజాతాసింగ్ను ఇంటర్వ్యూ చేసింది. పదవినుంచి తొలగింపుపై ఆమె స్పందిస్తూ.. ప్రభుత్వం ఇంత నీచంగా, దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారన్న సామాజిక వెబ్సైట్లలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్ముతున్నట్లు తెలిపారు. కావాలనుకుంటే పదవినుంచి వైదొలగవచ్చని గత సంవత్సరమే కోరారని.. ప్రతిగా మూడేండ్లు లేక ఐదేండ్లపాటు ఏదైనా రాజ్యాంగ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. విదేశాంగ శాఖలో బాధ్యత.. సేవలు దృష్టిలో పెట్టుకుని ఆ ఆఫర్లను తోసిపుచ్చినట్లు పేర్కొన్నారు.

గౌరవప్రదంగా పదవినుంచి తప్పుకోవాలని అనుకున్నానని చెప్పారు. రాయబారిగానో యూపీఎస్సీ నుంచో నేను పదవీ విరమణ చేయాలని అనుకోలేదని స్పష్టం చేశారు విదేశాంగ శాఖ కార్యదర్శిగా వైదొగాలని భావించానని, కానీ, దారుణమైన రీతిలో నన్ను తొలగించారు అని సుజాతాసింగ్ అన్నారు. గత ఎనిమిది నెలలుగా దేశం అనుసరిస్తున్న విదేశీ విధానం కేవలం ప్రధాని నరేంద్రమోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తోనో ఏర్పడలేదని అన్నారు. ఎంతోమంది సమిష్టికృషితో ఈ విధానాన్ని రూపొందించారని, అందులో పాలుపంచుకున్నందుకు తనకు మరింత గౌరవమర్యాదలు దక్కాల్సిందని అన్నారు.
అమెరికా ఒత్తిడికి సుజాతాసింగ్ బలి: కాంగ్రెస్
అమెరికా ఒత్తిడితోనే సుజాతాసింగ్ను విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్ విమర్శించింది. అమెరికా అధ్యక్షుడి పర్యటన ముగిసిన వెంటననే ఆమెను తొలగించటం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. అమెరికాలో ఖోబ్రగడేను అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో ఆ దేశంలో భారత రాయబారిగా ఉన్న సుజాతాసింగ్ ఆ ఘటనపై అమెరికా ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపారు. దేవయాని ఖోబ్రగడే విషయంలో ఆమె (సుజాతాసింగ్) స్థిరంగా ఉన్నందుకు ఇది శిక్షా? అమెరికా అధ్యక్షుడు వచ్చివెళ్లగానే ఆమెను తొలగించటం యాదృచ్ఛికమేనా? అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ గురువారం ట్విట్టర్లో ప్రశ్నించారు.
అత్యంత సీనియర్ మహిళా అధికారిని కారణం లేకుండా ఉన్నట్టుండి తొలగించటం మోదీ ప్రభుత్వ యంత్రాంగం, వారి ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని కాంగ్రెస్ ప్రతినిధి రనదీప్ సుర్జేవాలా అన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఐఐఎం డైరెక్టర్లను తొలగించిన కోవలోనే సుజాతాసింగ్ను కూడా తప్పించారని ఆరోపించారు. వీరంతా గత యూపీఏ ప్రభుత్వంలో నియమితులైనవారే కావటం గమనార్హం.












Click it and Unblock the Notifications