జగన్ వెళ్లిపోయేలా మేమే చేశాం: వీరప్ప మొయిలీ
న్యూఢిల్లీ: కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ గురువారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో తమ వ్యూహం విఫలమైందని ఆయన అన్నారు. జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయేలా తామే చేశామని ఆయన అన్నారు.
దేశంలో ప్రాంతీయ, స్థానిక నాయకత్వాలను అభివృద్ధి చేయలేకపోయామని ఆయన అన్నారు. కాంగ్రెసు ఎన్నికల్లో అనేక తప్పులు చేసిందని అన్నారు. కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఘోరంగా విఫలమైందని అన్నారు. లోకసభనే నడపలేని తాము దేశాన్ని ఎలా నడపగలమని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెసు పార్టీని నమ్మలేని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
కార్యక్రమాల అమలులో ప్రభుత్వ వేగం మందగించిందని అభిప్రాయపడ్డారు. ప్రధానికి అధికార యంత్రాంగం సహకరించలేదని చెప్పారు. ఓటమికి బాధ్యులను నిర్ధారించి, వారి నుంచి వివరణ కోరాలని ఆయన సూచించారు. గ్రామస్థాయి నుంచి ఎఐసిసి స్థాయి వరకు పార్టీలో ప్రక్షాళన అవసరమని, పార్టీకి భారీ శస్త్రచికిత్స జరగాలని మొయిలీ అన్నారు.
రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. వీరప్ప మొయిలీ చాలా కాలం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు.