జేఎన్యూ లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య : అంతకుముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్కు మెయిల్
న్యూఢిల్లీ : ఆ విద్యార్థికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. తాను చదివే లైబ్రరీ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ప్రొఫెసర్కు ఈ-మెయిల్ చేయడంతో విద్యార్థి ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నడిబొడ్డున గల ప్రముఖ వర్సిటీ జవాహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్
రిషి థామస్ అనే విద్యార్థి జేఎన్యూలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ .. లైబ్రరీ గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు. అయితే అంతకుముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఇంగ్లిష్ ప్రొఫెసర్ కు ఈ-మెయిల్ చేశాడు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రొఫెసర్ కు మెయిల్ వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఘటనాస్థలంలోకి వచ్చిన పోలీసులు లైబ్రరీ గదిలోకి వెళ్లారు. అక్కడే ఫ్యాన్ కు వేలాడుతూ విద్యార్థి కనిపించాడు.

రంగంలోకి క్రైం టీం
వెంటనే అతనిని సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. విద్యార్థి చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలాన్ని క్రైం టీం పరిశీలిస్తోందని డీసీపీ దేవేందర్ ఆర్య తెలిపారు. విద్యార్థి మృతికి సంబంధించి అతని కజిన్ కు సమాచారం అందించామని వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరిపై అనుమానం లేదని పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై జేఎన్ యూ సంతాపం తెలిపింది.












Click it and Unblock the Notifications