రక్తం ఇవ్వండి లేదంటే ఫెయిల్ చేస్తా: కాలేజీ ప్రిన్సిపాల్
న్యూఢిల్లీ: ఛత్తీస్ గఢ్లోని బల్రామ్పూర్ జిల్లాలో ఓ కళాశాల ప్రిన్సిపాల్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో పాసలవ్వాలంటే రక్తదానం చెయ్యాల్సిందేనంటూ విద్యార్ధులకు హుకుం జారీచేశాడు. దీంతో భయపడిన విద్యార్ధులు రక్తదానం చేశారు. ఆ రక్తాన్ని జిల్లాలోని ఓ ప్రవేట్ బ్లడ్ బ్యాంకుకు విక్రయించినట్లు ఆ ప్రిన్సిపాల్పై ఆరోపణలు వచ్చాయి.
వివరాల్లోకి వెళితే... ఛత్తీస్ గఢ్లోని బల్రామ్పూర్ జిల్లాలో రాజ్ పూర్ ప్రభుత్వ కాలేజీకి ప్రిన్సిపాల్ గా డాక్టర్ బీకే గార్గ్ వ్యవహరిస్తున్నాడు. తన విద్యార్ధులను రక్తదానం చేయాలని, అలా చేస్తే బ్లడ్ బ్యాంకులు, ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇస్తాయని ప్రలోభపెట్టాడు.
బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న కపిల్ దేవ్ తెలిపిన సమాచారం ప్రకారం సుమారు 70 మంది విద్యార్ధులు (35 మంది అమ్మాయిలు, 35 మంది అబ్బాయిలు) అంబికాపూర్లో ఉన్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్లో సెప్టెంబర్ 25న బ్లడ్ ఇచ్చేందుకు అంగీకరించగా.. మరికొందరు వ్యతిరేకించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా మంది ఉపవాసం ఉండటంతో చాలా మంది విద్యార్ధులు వ్యతిరేకించారు. దీంతో, తన మాట వినని విద్యార్థులను ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించాడు. గతంలో తన మాట లక్ష్యపెట్టని కొందరు విద్యార్థులను ఇలాగే ఫెయిల్ చేశానంటూ వారిని హెచ్చరించాడు.
తాను నిర్వహించే రక్తదాన శిబిరానికి జిల్లాస్థాయి అధికారులు వస్తారని తెలిపినా, ఒక్క అధికారి కూడా హాజరుకాలేదు. అటు, రక్తమిచ్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లూ ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్కు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనిపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ అసలు ఏమి జరిగిందో తెలియజేయాల్సిందిగా కోరారు. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ గార్గ్ నవంబర్ 10 వరకు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లాడు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ భూపేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుతో కలసి రక్తదాన శిబిరం నిర్వహించడంపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
ప్రిన్సిపాల్ గార్గ్ తిరిగిరాగానే ఆయనను విచారించి తగిన యాక్షన్ తీసుకుంటామన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని చెప్పారు.