సీజేఐ రమణ ప్రతిపాదనతో ఎంపిక -సీబీఐ కొత్త డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతల స్వీకారం
భారత దేశానికి సంబంధించి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1985 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఆయన సీబీఐ డైరక్టర్గా రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. కొవిడ్ పరిస్థితల నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా జైస్వాల్ సాదాసీదాగా పదవీబాధ్యతలు చేపట్టారు.
ఇంతకుముందు సీబీఐ డైరెక్టర్గా రెండేండ్ల పాటు పనిచేసిన రిషి కుమార్ శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరి 3న పదవీ విరమణ చేయడంతో మూడు నెలలుగా ఆ పదవి ఖాళీగా ఉంది. సీబీఐకి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే, అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగారు. సుబోధ్ కుమార్ ఎంపికతో ఇప్పుడు పూర్తిస్థాయి డైరెక్టర్ నియామకం జరిగింది. సుబోధ్ కుమార్ కుమార్ జైస్వాల్ నిన్నటి వరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించారు. గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. నిజానికి..
మోదీ పాలనకు 7ఏళ్లు: నేడు బ్లాక్ డే -రైతు ఉద్యమానికి 6నెలల సందర్భంగా దేశమంతటా నల్లజెండాలతో నిరసనలు
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు అనుకూలమైన అధికారిని సీబీఐ డైరెక్టర్ గా నియమించుకోవడం పరిపాటిగా వస్తోంది. ఆక్రమంలోనే ప్రస్తుత బీజేపీ.. బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా లేదా ఎన్ఐఏ అధిపతి వైసీ మోదీలో ఒకరికి ఆ పదవి కట్టబెట్టాలనుకుంది. కానీ, హైపవర్ కమిటీలో సభ్యుడైన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపికలోసరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కేవలం 6 నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్నవారిని ఈ పదవికి ఎంపిక చేయరాదని గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందని, దాన్ని పాటించాల్సిందిగా ప్రధాని మోదీకి ప్రతిపాదించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మొండిపట్టుదలకు పోవడం మంచిదికాదన్న ఉద్దేశమో, మరో కారణమో మొత్తానికి సీజేఐ సూచనను ప్రధాని స్వీకరించడం, ఫలితంగానే ఎస్కే జైస్వాల్కు అవకాశం దక్కడం జరిగాయి.
సుబోధ్ కుమార్ జైస్వాల్ జూన్ 2018 నుంచి ఫిబ్రవరి 2019 వరకు ముంబై పోలీసు కమీషనర్గా పనిచేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర డీజీపీ అయ్యారు. తెల్గీ స్కామ్ను సీబీఐ తీసుకోకముందే.. జైస్వాల్ ఆ కేసును విచారించారు. ఆ రాష్ట్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ అధిపతిగా కూడా చేశారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్లోనూ విధులు నిర్వర్తించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు రా వింగ్లోనూ చేశారు. సీబీఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్.. ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరంబీర్ సింగ్ చేసిన వంద కోట్ల వసూళ్ల ఆరోపణల కేసును దర్యాప్తు చేపట్టనున్నారు. సీబీఐ కొత్త డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జైస్వాల్ కు పలువురు అభినందనలు తెలిపారు.