పుస్తకం: సుబ్రహ్మణ్య స్వామికి మోడీ ప్రభుత్వం షాక్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ప్రధాని మోడీ ప్రభుత్వం షాకిచ్చింది! స్వామి రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. ఆయన రాసిన పుస్తకం దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ఉందని నివేదించింది.
2006లో సుబ్రహ్మణ్య స్వామి ప్రచురించిన భారత్లో ఉగ్రవాదం (టెర్రరిజం ఇన్ ఇండియా) పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ మంగళవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఈ పుస్తకం ఉందని పేర్కొంది.
భారత్లోని ఓ వర్గం ప్రజలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేశారని, ఈ పుస్తకంలోని ఇతివృత్తం, భాష, ఉఫమానాలు అన్నీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొంది. సుబ్రహ్మణ్య స్వామి పైన విచారణ జరిపేందుకు మద్దతు తెలిపింది.
కాగా, సుబ్రహ్మణ్య స్వామి... మోడీ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారు. దీనిపై స్వామి మాట్లాడుతూ... తాను ప్రధాని మోడీని, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలుస్తానని చెప్పారు. ప్రభుత్వం వాదన తనను ఆశ్చర్యపరిచిందన్నారు. యూపీఏ ప్రభుత్వమే తన పుస్తకం పైన ఏం మాట్లాడలేదన్నారు. తన పాపులారిటీ నేపథ్యంలో, ఏదో కుట్ర ఉందని అర్థమవుతోందని ఆయన ఇంగ్లీష్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.