రెట్టింపు స్థాయిలో మళ్లీ కరోనా ఉద్దృతి.. కలవరపెడుతున్న కేసులు, మరణాలు.. కేంద్రం హై అలెర్ట్
దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లోనే 13,154 కొత్తకేసులు నమోదయ్యాయి. నెల రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అటు ఒమిక్రాన్ కేసులు కూడా 1000కి చేరువయ్యాయి. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తితో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 14 నగరాలను అలెర్ట్ చేసింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
మళ్లీ కరోనా ఉద్ధృతి..
దేశంలో దాదాపు 33 రోజుల తర్వాత కరోనా కొత్త కేసులు 10వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లోనే 268 మంది మృతి చెందారు. ఈ కేసుల సంఖ్య పెరుగుదల ప్రధానంగా మెట్రో నగరాల్లోనే నమోదైంది. ముంబయిలో ఒక్కరోజులోనే వైరస్ బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అయింది. ఒక్కరోజులోనే 2510కి చేరాయి. ఢిల్లీలో 923 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే ఇది 86 శాతం అధికమని వైద్యాధికారులు తెలిపారు. కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో అక్కడ సామాజిక వ్యాప్తి జరిగిందేమోనన్న అనుమానాలను ఢిల్లీ సర్కార్ వ్యక్తం చేస్తుంది.
మెట్రో నగరాల్లోనే కేసుల పెరుగుదల
మరోవైపు గుర్గావ్, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులోనూ కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఝార్ఖండ్, గుజరాత్, హరియాణా రాష్ట్రాలలో కేసులు పెరుగుదలపై కేంద్రం ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రాల్లోని ప్రధానంగా ఎనిమిది జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతంపైనే ఉందని తెలిపింది. 14 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యలో కేసుల పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది.
కేంద్రం అలెర్ట్..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 951 కేసులు నమోదయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ తో 59 మంది మఈతి చెందారు. చాలా రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాత్రిపూట కర్ప్యూ వంటి ఆంక్షలు విధించాయి. మాస్కులు వాడటం తప్పసరి చేశాయి. రద్దీ ప్రదేశాలకు భౌతిక దూరంగా ఉండాలని సూచించారు. అటు న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి రాష్ట్ర ప్రభుత్వాలు ..