Summit for Democracy: ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలివే: బైడెన్తో ప్రధాని మోడీ వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించిన సమ్మిట్ ఫర్ డెమోక్రసీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భాగస్వామ్యులయ్యారు. వర్చువల్ విధానంలో ఆయన ఇందులో పాల్గొన్నారు. తొలి రోజు నరేంద్ర మోడీ సహా 12 మంది వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 80 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అమెరికా, భారత్ సహా ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, జపాన్, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ దేశాధినేతలు తొలిరోజు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు వంటిదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భావసారూప్యం గల దేశాలతో కలిసి పని చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రూల్ ఆఫ్ లా అనేది భారత పౌరుల్లో జీర్ణించుకుపోయిందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం మూలాలను విస్మరించట్లేదని, అదే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు.

తాము నివసిస్తోన్న దేశాల ఆర్థిక పురోగమనానికి, సామాజిక సమతౌల్యానికి ప్రవాస భారతీయులు చేస్తోన్న కృషిని ఏ మాత్రం విస్మరించలేమని అన్నారు. తాము రచించుకున్న రాజ్యాంగానికి లోబడి.. ప్రతి ఒక్క పౌరుడికీ సమన్యాయాన్ని అందించమే సిసలైన ప్రజాస్వామ్యంగా భావిస్తామని చెప్పారు. సునిశితత్వం, జవాబుదారీతనం, సంస్కరణల్లో భాగస్వామ్యం కావడం, సమ్మిళిత అభివృద్ధిని సాధించడమే భారత ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలుగా నిలిచాయని ప్రధాని మోడీ చెప్పారు.
ప్రజాస్వామ్య మూల సూత్రాలు.. గ్లోబల్ గవర్నెన్స్కు కేంద్ర బిందువు కావాలని మోడీ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య పరిరక్షణను దేశ పౌరులు తమ బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏదీ విజయవంతం కాబోదని స్పష్టం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ను ప్రపంచ ప్రజలు సమష్టిగా ఎదుర్కొన్న విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రజల సహకారం వల్లే లాక్డౌన్ విజయవంతమైందని పేర్కొన్నారు.
Happy to have participated in the Summit for Democracy at the invitation of President Biden. As the world's largest democracy, India stands ready to work with our partners to strengthen democratic values globally, including in multilateral fora. @POTUS
— Narendra Modi (@narendramodi) December 10, 2021
ఈ సమ్మిట్ ప్రారంభోపన్యాసంలో జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా సేవలను ఆయన స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తరం మారిన ప్రతీసారీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా దాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామం- ప్రభుత్వం వేర్వేరు కాదని చెప్పారు. సమన్యాయం, వాక్ స్వాతంత్య్రం, మీడియా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ.. ఇవన్నీ ఇందులో భాగమేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications