సునంద కేసు: మెహర్తో చాట్స్పై ఢిల్లీ పోలీసుల విచారణ
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా సునంద పుష్కర్కి పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్కు మధ్య జరిగిన సంభాషణ వివరాలను సేకరిస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునంద పుష్కర్ నాలుగు ఆన్లైన్ ఖాతాలను కలిగి ఉంది. గూగుల్, యాహూల్లో రెండు ఈ మెయిల్ ఖాతాలు, ట్విట్టర్, ఫేస్బుక్లలో మరో రెండు ఖాతాలు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలీసులు సునందకు సంబంధించిన రెండు ఈ మెయిల్ ఖాతాల ప్రొవైడర్ల నుంచి వివరాలను సేకరించినట్లు ఓ డెయిలీలో కథనం ప్రచురితమైంది.
ఇక మిగిలిన ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల నుంచి కూడా సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జనవరి 17కు ముందు ఆమె ఎవరెవరికి ఈ మెయిల్స్ పంపారు, ఆమెకు ఎవరెవరు ఈ మెయిల్ చేశారు, ఎవరితో చాటింగ్ చేశారు అనే విషయాలపై గూగుల్, యాహూల నుంచి సమాచారాన్ని సేకరించారు. వారి ఐపి అడ్రస్లను సేకరించి విచారణ జరుపుతున్నారు.
ఇది ఇలా ఉండగా, ఢిల్లీ పోలీసులు తమకు ఎలాంటి సమాచారం కావాలో ఓ లేఖలో తెలిపితే అందుకు సంబంధించిన సమాచారం తాము ఇస్తామని ఫేస్బుక్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఫేస్బుక్, ట్విట్టర్ కంపెనీలకు లేఖ రాసే పనిలో ఉన్నట్లు ఆ డెయిలీ వెల్లడించింది.
సునందకు సంబంధించిన మూడు ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. సునంద విషం తాగడం వల్లే మృతి చెందిందని గత నెలలో వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో సునంద మృతి చెందింది. శశిథరూర్తో సంబంధంపై ట్విట్టర్లో పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్కు సునందకు మధ్య పలు వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో ఆమె మృతి చెందడం అనుమాస్పదమైంది.