సునంద పుష్కర్ హత్య కేసు: ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు?
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో పోలీసులు ముందడుగు వేస్తున్నారు. ఈ కేసులో అన్ని వివరాలు తెలిసినప్పటికి దర్యాప్తుకు సహకరించడం లేదని, ఆ ముగ్గురికి లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. మొదట ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది.
కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ ధావన్ లకు అన్ని వివరాలు తెలిసినప్పటికి దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు.
ఆ ముగ్గురు కేసు దర్యాప్తులో కీలమైన వ్యక్తులని, వారు సరైన సమాధానాలు వెల్లడిస్తే కేసు దర్యాప్తు కొలక్కి వస్తుందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఈ ముగ్గురిని ఎన్ని సార్లు విచారణ చేసినా సరైన సమాధానలు చెప్పడం లేదని పోలీసులు అంటున్నారు.
వారికి లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నెల 20వ తేదిన కేసు దర్యాప్తులో భాగంగా ఆ ముగ్గురు వ్యక్తులు కోర్టు ముందు హాజరు కానున్నారు. అదే రోజు ముగ్గురిని కస్టడికి అప్పగించాలని పోలీసులు కోర్టు ముందు మనవి చేయనున్నారు.