తెరపై ఒకపేరు...ఈవీఎంపై అసలు పేరు : కష్టాల్లో గురుదాస్పూర్ బీజేపీ అభ్యర్థి
గురుదాస్పూర్ : హీరోగా ఆయన అందరికీ సుపరిచితుడే... కానీ ఈ మధ్యే రాజకీయాల్లోకి అరంగేట్రం ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీతోనే లోక్సభ స్థానం నుంచి ఓ జాతీయ పార్టీ తరపున బరిలో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఒక నటుడిగా ప్రజలకు తెలిసిన ఆయన... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా చాలామందికి తెలియదు. ఇందుకు కారణం ఆయన పేరే. తెరపై కనిపించే తన పేరే తనను చిక్కుల్లోకి నెట్టేస్తుందని ఆ హీరో కూడా ఊహించి ఉండరు. టికెట్ ఇచ్చిన పార్టీకి కూడా ఈ విషయం కొత్త తలనొప్పిగా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరు... ఆయన పేరు తెచ్చిన తంటా ఏంటి..?
ఎవరీ అజయ్ సింగ్..?
సన్నీ డియోల్... ఉత్తరాదిన ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. అదే అజయ్ సింగ్ అంటే ఎవరు ఆ వ్యక్తి అని టక్కున అడిగేస్తారు. కానీ చాలామందికి తెలియదు సన్నీ డియోల్, అజయ్సింగ్ పేర్లు ఒక్క వ్యక్తివే అని. ఇప్పటి వరకు సినిమా స్క్రీన్పై సన్నీ డియోల్ పేరుతో పాపులర్ అయిన ప్రముఖ బాలీవుడ్ హీరో కొద్ది రోజుల క్రితం బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి తరం హీరో ధర్మేందర్ పుత్రుడిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ డియోల్ అనతి కాలంలోనే తనకంటూ ఓ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
నామినేషన్ పత్రాల్లో అసలు పేరు
సన్నీ డియోల్ బీజేపీ తీర్థం పుచ్చుకోగానే ఆ పార్టీ అధిష్టానం ఆయనకు గురుదాస్ పూర్ లోక్సభ స్థానం టికెట్ కేటాయించింది. ఇక నామినేషన్ కూడా దాఖలు చేశాడు సన్నీ డియోల్. నామినేషన్ డాక్యుమెంట్స్లో తన అసలు పేరు పొందుపర్చాడు. అజయ్ సింగ్ ధర్మేందర్ డియోల్ అని పేపర్స్లో పొందుపర్చాడు. ఇప్పుడు అదే పేరు ఈవీఎంలపై రానుంది. ఇది సన్నీడియోల్ను బీజేపీని ఒక్కింత డైలమాలో పడేసింది. చాలామందికి అజయ్ సింగ్ ధర్మేందర్ డియోల్ అంటే ఎవరో తెలియదు. మరి ఓటువేసేందుకు వచ్చిన ఓటర్లు ఈవీఎంపై ఈ కొత్త పేరు చూసి ఓటు వేస్తారా అన్న కన్ఫ్యూజన్ కాషాయం పార్టీలో క్రియేట్ అయ్యింది.
రంగంలోకి దిగిన బీజేపీ..పేరు మార్పును పరిశీలించాలంటూ విజ్ఞప్తి
ఈవీఎంలపై అజయ్ సింగ్ అని అసలు పేరు వస్తే మొదటికే మోసం రావొచ్చని గ్రహించిన కమలం పార్టీ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వెంటనే అజయ్ సింగ్ అని పేరున్న స్థానంలో సన్నీడియోల్ పేరుతో రీప్లేస్ చేయాలని అధికారులను కోరింది. ఇక నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాల్లో ఏ పేరైతే అభ్యర్థి ఇస్తారో అదే పేరును ఈవీఎంలపై ఉంటుంది. అయితే కొన్ని కారణాలతో కూడా సడలింపు ఇవ్వొచ్చనే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. త్వరలోనే గురుదాస్ పూర్ బీజేపీ అభ్యర్థి పేరులో క్రియేట్ అవుతున్న కన్ఫ్యూజన్ ముగిసిపోతుందని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గురువారం నుంచి సన్నీడియోల్ తాను పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఒక ట్రక్కుపై కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా పెద్ద ఎత్తున్న ప్రజల నుంచి స్పందన లభించింది.