బాలీవుడ్ నటుడి రాజకీయ అరంగేట్రం: ఒకే పార్టీలో తల్లి, కుమారుడు! లోక్ సభ ఎన్నికలకు సినీ గ్లామర్!
Recommended Video
చండీగఢ్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ రాజకీయ అరంగేట్రం చేశారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. కొద్దిరోజుల కిందటే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పట్లోనే ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. దీనికి- అనుగుణంగా మంగళవారం ఉదయం ఆయన అధికారికంగా కాషాయపార్టీలో చేరారు. ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. పార్టీలో చేరితే లోక్ సభ టికెట్ ఇస్తామనే భరోసా కల్పించడం వల్లే సన్నీ డియోల్.. బీజేపీలో చేరారనే తెలుస్తోంది.
తల్లి, కుమారుడు ఒకే పార్టీలో..
కాగా, సన్నీడియోల్ మారుతల్లి, బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని చాలాకాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు కూడా. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థగా బరిలో నిల్చున్నారు. ఈ లోక్ సభ స్థానానికి ఈ నెల 19వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.
ఈసారి ఎన్నికల్లో స్టార్ క్యాస్ట్ ఎక్కువే..
ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో స్టార్ క్యాస్ట్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. వివిధ భాషల్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు లోక్ సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మలయాళ నటుడు సురేష్ గోపీ బీజేపీ అభ్యర్థిగా కేరళలోని త్రిశూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. తెలుగు నటి జయప్రద ఉత్తర్ ప్రదేశ్ లోని రామ్ పూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. రాజ్ బబ్బర్, జయాబచ్చన్, ఊర్మిళా మతోండ్కర్ వంటి స్టార్ నటులు ఈ సారి లోక్ సభ ఎన్నికలకు సినీ గ్లామర్ అద్దారు.