కరుణానిధి, జయలలిత తర్వాతీ స్థానం రజనీదే, హెల్త్ సహకరించి ఉంటే..?: గురుమూర్తి
తమిళనాట మరో రాజకీయ ప్రభంజనం రావాల్సి ఉందని విశ్లేషకుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్నేహితుడు ఎస్ గురుమూర్తి అభిప్రాయపడ్డారు. ఆయన ఇండియా టుడే కాంక్లేవ్లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి.. మధ్యలోనే వైదొలగడం కాస్త నిరాశ కలిగించిందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేదీ రజనీకాంత్ ఒక్కరేనని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని భారీగా జనం కోరుకున్నారు. గత డిసెంబర్ నుంచి ఒక్కటే హడావిడి చేశారు. అయితే ఆయన అనారోగ్యానికి గురవడంతో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు బ్రేక్ పడింది. అయితే రజనీకాంత్ నిర్ణయం గురించి తెలిసి తానేమీ ఆశ్చర్యపోలేదని తెలియజేశారు. రజనీని తాను చాలా రోజుల నుంచి చూస్తున్నానని తెలిపారు.
కానీ ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి.. నడిపించడం అంతా తేలికైన విషయం కాదన్నారు. అందుకు ఆరోగ్యం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి సంబంధించి రజనీకాంత్, అతని కుటుంబం, వైద్యులు కలిసి సంప్రదింపులు జరిపి.. నిర్ణయం తీసుకున్నారని గురుమూర్తి వెల్లడించారు.
రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు రజనీ ఆరోగ్యం సహకరించకపోవడం దురదృష్టకరం అని గురుమూర్తి అన్నారు. కానీ తమిళనాడుకు ఏదో చేయాలని రజనీ అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదివరకు కరుణానిధి, జయలలిత ఎలానో ఇప్పుడు రజనీ కూడా అలానే ఉంటారని పేర్కొన్నారు.