రాఫెల్ తీర్పుపై పునఃసమీక్ష చేయనున్న సుప్రీంకోర్టు... విచారణ తేదీ ఎప్పుడు..?
ఢిల్లీ: రాఫెల్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఇప్పటికే విపక్షాలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం ఇచ్చిన తీర్పుతో విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా దాఖలు అయ్యాయి. గతేడాది డిసెంబర్ 14న రాఫెల్పై దాఖలైన పిల్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. పిల్లను దాఖలు చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, మరియు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు కూడా ఉన్నారు. అయితే రివ్యూ పిటిషన్లను విచారణ చేస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ నాలుగు పిటిషన్లు రాఫెల్పై దాఖలయ్యాయని మరొకటి రిజిస్ట్రీ వద్దే ఉందని వెల్లడించింది. విచారణ చేస్తున్న బెంచ్లోని సభ్యులను మార్పు చేయాలంటే ఈ సమయంలో కష్టమని వ్యాఖ్యానించింది. రాఫెల్ కేసులో దాఖలైన పిటిషన్ను వెంటనే విచారణ స్వీకరించాల్సిందిగా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. అయితే ఫలానా రోజున విచారణ చేస్తామని తేదీతో సహా చెప్పడం కష్టమని బెంచ్ వ్యాఖ్యానించింది.ఇక విచారణ చేస్తున్న బెంచ్లో సభ్యులుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు ఉన్నారు.
ఇక ఆప్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ మాత్రమే పెండింగ్లో ఉందని కొన్ని కారణాలతో రిజిస్ట్రీ దగ్గరే ఆగిపోయిందని చెప్పిన ప్రశాంత్ భూషణ్ తాము దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామని బెంచ్ పేర్కొంది. ప్రశాంత్ భూషణ్తో పాటు కేంద్రమాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు రాఫెల్ అంశంపై తప్పుడు సమాచారం ఇచ్చారని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు తమ పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు.