శబరిమలపై తీర్పు సమీక్షకు...సుప్రీం కోర్టు ఓకే;నవంబరు 13న విచారణ
Recommended Video

న్యూఢిల్లీ:శబరిమలపై సుప్రీం కోర్టు తీర్పును సమీక్షించాలంటూ అయ్యప్ప భక్తుల సంఘం, ఇతరులు వేసిన రివ్యూ పిటిషన్లపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
శబరిమలపై తీర్పును సమీక్ష కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై నవంబరు 13న విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులిచ్చామని సీజే రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం న్యాయవాది మాథ్యూస్ నెడుంపరకు తెలియచేసింది.

జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ గురించి ప్రస్తావించిన మాథ్యూస్ కు ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. శబరిమల గుడిలోకి అన్ని వయసుల మహిళలు అందరినీ అనుమతిస్తూ సెప్టెంబరు 28న ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పాటు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం వద్ద అత్యంత ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో ను పునస్సమీక్షించాలంటూ భక్తుల సంఘం, ఇతరులు మొత్తం 19 రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ రివ్యూ పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టాలని పిటిషన్ దారులు కోరగా సుప్రీం కోర్టు అందుకు భిన్నంగా స్పందించింది. రివ్యూ పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టబోమనీ, దసరా సెలవుల తర్వాతనే వాటిని విచారిస్తామని ఈనెల 9న ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోవైపు శబరిమల మహిళల ప్రవేశం వివాదంపై బీజేపీ, ఆరెస్సెస్ పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికే శబరిమలలో వారు ఒక పథకం ప్రకారం ఆందోళనలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప ఆలయం వద్ద శాంతిని భగ్నం చేయడానికి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. అయ్యప్ప ఆలయాన్ని సమస్యాత్మక కేంద్రంగా మార్చే క్రిమినల్స్ను అనుమతించబోమని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవించాలని అంటూనే అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications