పోలవరంపై ఒడిశా పిటిషన్: 30లోగా ఇవ్వకుంటే మేమే నిర్ణయిస్తాం.. ఏపీకి సుప్రీం
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ పైన సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఏ అంశాలపై వాదనలు వినిపించాలో నివేదిక ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో అడిగింది.
దీనిపై ఇప్పటి వరకు నివేదిక ఎందుకు తయారు చేయలేదని న్యాయస్థానం.. ఏపీని ప్రశ్నించింది. దానికి ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఒడిశా, చత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సహకరించలేదని తెలిపారు. ఏపీ వాదనలపై ఒడిశా, చత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అనంతరం చర్చించాల్సిన అంశాలపై జూలై 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సంబంధించిన అంశాలు తెలియకుంటే తామే నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 30వ తేదీకి వాయిదా వేసింది.