Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయినా సరే హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ -అసంపూర్ణంగా సుప్రీంకోర్టు కొలీజియం భేటీ -సీజేఐ బోబ్డే రికార్డు

సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అత్యున్నత వ్యవస్థగా భావించే సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయినప్పటికీ నిర్ణయాలేమీ తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. గురువారం నాటకీయ పరిణామాల మధ్య చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బోబ్డే అధ్యక్షతన సుప్రీం కొలీజియం సమావేశమైంది. తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకాన్ని రాష్ట్రపతి అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా సిట్టింగ్ సీజేఐ కొలీజియం నిర్వహించడం, అదే రోజు జస్టిస్ రమణ సెలవు పెట్టడం, మరో ఇద్దరు జడ్జిలు భేటీకి విముఖంగా ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్నటి సమావేశానికి ఎనలేని ప్రధాన్యం దక్కింది.

అలా తొలిసారి.. అందుకే రచ్చ

అలా తొలిసారి.. అందుకే రచ్చ

ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల పదవుల భర్తీ ప్రక్రియ సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా చేపడతారన్న సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యులండే సుప్రీం కొలీజియానికి సీజేఐ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే చాలా రోజుల కిందటే కొలీజియం భేటీ తేదీని నిర్ణయించారు. ఈ నెల 23న బోబ్డే పదవీ విరమణ చేయనుండగా, తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈనెల 4న అధికారిక ప్రకట చేశారు. సాధారణంగా కొత్త సీజేఐ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత సిట్టింగ్ లేదా ఔట్ గోయింగ్ సీజేఐ ఆధ్వర్యంలో కొలీజియం సమావేశాన్ని నిర్వహించకూడదు. కానీ తేదీ ముందే ఖరారైన సమావేశాన్ని రద్దు లేదా వాయిదా వేసేందుకు జస్టిస్ బోబ్డే నిరాకరించడం, కచ్చితంగా భేటీ జరపడం వల్లే ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. ఈలోపే..

కొలీజియం వేళ నాటకీయ పరిణామాలు..

కొలీజియం వేళ నాటకీయ పరిణామాలు..

అనూహ్య రీతిలో జరిగిన కొలీజియం భేటీ సందర్భంగా సుప్రీంకోర్టులో, దాని చుట్టూ గురువారం నాటి పరిణామాలు నాటకీయంగా సాగాయి. కొలీజియంలో సీజేఐ బోబ్డేతోపాటు కాబోయే సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ లు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు జడ్జిలు సీజేఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ సమయంలో కొలీజియం భేటీ నిర్వహణ సరికాదని వారు అభిప్రాయపడ్డట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అదీగాక జస్టిస్ రమణ గురువారం కోర్టు విధులకు హాజరుకాకపోవడం, స్వల్ప అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నట్లు వెల్లడి కావడంతో కొలీజియం భేటీపై నీలి నీడలు కమ్ముకున్నట్లు కొన్ని ఛానళ్లు వార్తలు ప్రచురించాయి. చివరికి వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ..

జడ్జిల విముఖత వట్టిదే..

జడ్జిల విముఖత వట్టిదే..

పరిణామాలు పైకి నాటకీయంగా కనిపించినా, సుప్రీం కొలీజియానికి ఉండే సీరియస్ నెస్ ఏమాత్రం తగ్గకుండా అందరు సభ్యులూ భేటీకి హాజరయ్యారు. స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పటికీ జస్టిస్ రమణ కొలీజియం భేటీకి వెళ్లారు. మిగతా జడ్జిలు కూడా తాము 'భేటీపై విముఖత వ్యక్తం చేశామని' మీడియాలో వచ్చిన వార్తల పట్ల అసంతృప్తి చెందారని, కొలీజియం సమావేశం విషయంలో సీజేఐ నిర్ణయంపై జడ్జిల అభిప్రాయ వ్యక్తీకరణలు వట్టిదేనని సుప్రీంకోర్టు వర్గాలు చెప్పినట్లుగా 'బిజినెస్ స్టాండర్డ్' పేర్కొంది. అయితే, కొలీజియం భేటీ అసలు ఉద్దేశం మాత్రం అసంపూర్తిగానే ముగియడం గమనార్హం.

నిర్ణయాలు లేకుండా నామమాత్రంగా..

నిర్ణయాలు లేకుండా నామమాత్రంగా..


సీజేఐగా జస్టిస్ రమణ నియమితులైన తర్వాత కూడా ఔట్ గోయింగ్ సీజేఐగా జస్టిస్ బోబ్డే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి గురువారం నాటి కొలీజియం భేటీ నామమాత్రంగానే ముగిసింది. సుప్రీంకోర్టులో ఆరు జడ్జి పదవులు ఖాళీగా ఉండగా, వాటిలో భర్తీ చేసేందుకు కర్ణాటక హైకోర్టు సీజే నాగరత్న పేరును, త్రిపుర హైకోర్టు సీజే అఖిల్ ఖురేషీ పేరును కొలీజయం పరిశీలనకు స్వీకరించిందని, వివిధ రాష్ట్రాల హైకోర్టు జడ్జిల నియామకాలకు సంబంధించి మోదీ సర్కారు సిఫార్సు చేసిన 45 మంది పేర్లను కూడా కొలీజయం పరిశీలనకు స్వీకరించిందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. నామమాత్రంగా సాగిన ఈ భేటీలో పరిశీలనలే తప్ప నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. ఈనెల 24న సీజేఐగా జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయమూర్తుల భర్తీపై కొలీజియం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోనుంది. కాగా,

Recommended Video

    Telangana : లిక్కర్ షాపులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు లేవు - హైకోర్టు
    సీజేఐ బోబ్డే పేరిట ఆ రికార్డు..

    సీజేఐ బోబ్డే పేరిట ఆ రికార్డు..


    భారత సుప్రీంకోర్టుకు 47వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈనెల 23న పదవీ విరమణ చేస్తారు. ఆ మరుసటి రోజే జస్టిస్ ఎన్వీ రమణ 48వ సీజేఐగా బాధ్యతలు చేపడతారు. కాగా, సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ బోబ్డే పేరిట ఒక రికార్డు నమోదు కానుంది. అదేంటంటే, ఏడాది అంతకంటే ఎక్కువ కాలంపాటు సీజేఐగా కొనసాగి, ఒక్కటంటే ఒక్క నియామకాన్ని కూడా చేపట్టని సీజేఐగా ఆయన మిగిలిపోనున్నారు. తక్కువ కాలం పదవిలో ఉండే సీజేఐలను పక్క పెడితే, ఏడాదికంటే ఎక్కువ సమయం కొనసాగిన వారంతా అటు సుప్రీంకోర్టులోనో, ఇటు హైకోర్టుల్లోనో కనీసం ఒక్కటైనా నియామకాలను చేపట్టారు. కానీ జస్టిస్ బోబ్డే మాత్రం 15 నెలల పదవీ కాలంలో ఒక్క జడ్జిని కూడా నియమించలేదు. సుప్రీంకోర్టులో ఆరుగుడు జడ్జిల భర్తీ, హైకోర్టు జడ్జిల నియామకాలన్నీ జస్టిస్ రమణ ఆధ్వర్యంలో జరుగనున్నాయి. కొలీజియం పరిశీలనలో ఉన్న కర్ణాటక హైకోర్టు సీజే నాగరత్న సుప్రంకోర్టు జడ్జిగా నియమితురాలైతే గనుక.. దేశంలోనే తొలి మహిళా సీజేఐ అయ్యే అవకాశం ఆమెకు దక్కుతుంది. జస్టిస్ నాగరత్న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైతే, సీనియారిటీ ప్రకారం 2027లో ఆమెకు సీజేఐ పదవి దక్కే ఛాన్స్ ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+