నమ్మకంలేక పారిపోతే దయ చూపించాలా: జస్టిస్ కర్ణన్కు సుప్రీం షాక్
మాజీ జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్కు సుప్రీం కోర్టులో బుధవారం చుక్కెదురయింది. సుమారు నెలన్నర పాటు అజ్ఞాతంలో ఉండి మంగళవారం కోవై (కోయంబత్తూరు)లో పోలీసులకు పట్టుబడిన కర్ణన్ ఇక జైలుకు వెళ్లక తప్పేలా లేదు.
న్యూఢిల్లీ: మాజీ జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్కు సుప్రీం కోర్టులో బుధవారం చుక్కెదురయింది. సుమారు నెలన్నర పాటు అజ్ఞాతంలో ఉండి మంగళవారం కోవై (కోయంబత్తూరు)లో పోలీసులకు పట్టుబడిన కర్ణన్ ఇక జైలుకు వెళ్లక తప్పేలా లేదు.
ఆయన పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దేశ న్యాయవ్యవస్థపై ఎంతమాత్రమూ నమ్మకం లేకుండా పారిపోయిన ఆయనపై దయ చూపించాల్సిన అవసరం ఏమిటని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు.
కాగా, సుప్రీం కోర్టుకు ఎదురు నిలిచి, న్యాయమూర్తులకు సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధిస్తున్నట్టు చెప్పి, ఆపై కోల్కతా నుంచి తమిళనాడుకు పారిపోయిన కర్ణన్, దేశ చరిత్రలో అజ్ఞాతంలో ఉండి పదవీ విరమణ చేసిన తొలి న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో కర్ణన్ను నేడు పశ్చిమ బెంగాల్ పోలీసులు జైలుకు తరలించనున్నారు. ఆయనకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడగా, ఇప్పుడు పారిపోయిన కేసూ ఎదుర్కోవాల్సి ఉంది.