టెన్త్, ఇంటర్ ఫైనల్ ఆఫ్లైన్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం: ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వినిపించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల మధ్య ఆఫ్లైన్లో పరీక్షలను నిర్వహించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు శ్రేయస్కరం కాదంటూ దాఖలైన పిటీషన్లు అవి. మార్చి/ఏప్రిల్లల్లో వాటిని నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇదివరకే విడుదలైంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి కేంద్రీయ విద్యాసంస్థలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బోర్డ్ పరీక్షలను నిర్వహించడానికి సమాయాత్తమౌతున్నాయి. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆఫ్లైన్ పరీక్షలను రద్దు చేసేలా ఉత్తర్వులను జారీ చేయాలంటూ పలు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

వాటన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటీషన్ల తరఫున ప్రముఖ అడ్వొకేట్ ప్రశాంత్ పద్మనాభన్ తన వాదనలను వినిపించారు. జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం- వాదనలను ఆలకించింది. కొద్దిసేపటి కిందటే తన నిర్ణయాన్ని వెలువడించింది. ఈ పిటీషన్లన్నింటినీ కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి పిటీషన్లపై విచారణ నిర్వహించడం సబబు కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటీషన్ల వల్ల కోట్లాదిమంది విద్యార్థులకు తప్పుడు సంకేతాలను పంపించినట్టవుతుందని పేర్కొంది.
గత సంవత్సరం తరహా పరిస్థితులు ఇఫ్పుడు లేవని బెంచ్ స్పష్టం చేసింది. పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనేది అధికారులకే వదిలి వేస్తున్నామని వ్యాఖ్యానించింది. అధికారులు ఇదివరకే షెడ్యూల్ను రూపొందించారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు జస్టిస్ ఖన్విల్కర్ పేర్కొన్నారు. ఇలాంటి పిటీషన్లను విచారించడం సహేతుకం కాదని తేల్చి చెప్పారు. ఒక ఉన్నత వ్యవస్థలో ఇలాంటి పిటీషన్లు.. గందరగోళానికి దారి తీస్తాయని అన్నారు.












Click it and Unblock the Notifications